నేను చచ్చినా మోటార్లకు మీటర్లు పెట్టనని మోదీకి చెప్పిన : కేసీఆర్

నేను చచ్చినా  మోటార్లకు  మీటర్లు పెట్టనని మోదీకి చెప్పిన : కేసీఆర్

ప్రధాని మోదీకి ప్రవేటు పిచ్చి పట్టిందని విమర్శించారు సీఎం కేసీఆర్.  ఇప్పటికే రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు ప్రైవేటుపరం చేశారన్న కేసీఆర్..  సంస్కరణల పేరిట విద్యుత్  రంగాన్ని కూడా ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.   పొలాల వద్ద మోటారుకు మీటర్ పెట్టాలని తనపై కేంద్రం  ఒత్తిడి చేసిందని కేసీఆర్ ఆరోపించారు.  కానీ తాను..  చచ్చినా పొలాల వద్ద మోటార్లకు  మీటర్లు పెట్టనని కేంద్రానికి చెప్పానన్నారు.   మోటార్లకు మీటర్లు పెట్టనందుకు కేంద్రం మనకు ఇవ్వాల్సిన రూ.లక్ష కోట్లు ఇవ్వలేదని ఆరోపించారు. బాల్కొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు.  

మన దేశంలో ప్రజాస్వామ్య పరిణతి ఇంకా పెరగడం లేదన్నారు సీఎం కేసీఆర్.  ఏమరుపాటుగా ఓటేస్తే  మన భవిష్యత్తు ఆగమవుతుందుని చెప్పారు.  ఒక్క అవకాశం ఇవ్వమని కాంగ్రెస్ అడుగుతుందని,  కాంగ్రెస్ కు 11 సార్లు అవకాశం ఇస్తే ఏం చేశారని  కేసీఆర్ ప్రశ్నించారు.  50 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్  దేశానికి, రాష్ట్రానికి ఏం చేసిందో ఆలోచించాలని ప్రజలను కోరారు.  

2014కు ముందు తెలంగాణలో కరెంట్‌ పరిస్థితి ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలన్నారు కేసీఆర్.  ప్రస్తుతం దేశంలో 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.  చిన్న రాష్ట్రమైన తెలంగాణ ఈరోజు.. తలసరి విద్యుత్‌ వినియోగంలో ముందుందన్నారు.  సంక్షేమం ఇలాగే కొనసాగాలంటే  బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.  కరెంట్ 3 గంటలు కావాలా 24 గంటలు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు.  

ALSO READ :- ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ ​చేయాలి: చెరుకు రైతుల డిమాండ్​