ఇయ్యాల ఢిల్లీకి సీఎం కేసీఆర్

ఇయ్యాల ఢిల్లీకి సీఎం కేసీఆర్
  • దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటన 
  • 22న చండీగఢ్, 26న బెంగళూర్, 27న రాలేగావ్ సిద్ధిలో టూర్
  • 29 లేదా 30న బెంగాల్, బీహార్ లోనూ పర్యటన  
  • ఆర్మీ అమరులు, ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరామర్శ  


హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీలో పలు రాజకీయ పార్టీల నేతలతో, ప్రముఖ ఆర్థికవేత్తలతో  సీఎం భేటీ కానున్నారు. మీడియా రంగానికి చెందిన ప్రముఖులతోనూ ఆయన సమావేశం అవనున్నారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారని ఈ మేరకు గురువారం సీఎంవో వెల్లడించింది. ఢిల్లీ పర్యటన తర్వాత 22న చండీగఢ్, 26న బెంగళూర్, 27న రాలేగావ్ సిద్ధి, 29 లేదా 30న బెంగాల్, బీహార్ లోనూ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆర్మీ అమరవీరుల కుటుంబాలను, అగ్రిచట్టాల రద్దు ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలను కూడా సీఎం పరామర్శించనున్నారు. ఉద్యమంలో చనిపోయిన 600 మంది రైతుల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా పాల్గొననున్నారు. బెంగళూర్ టూర్ లో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ భేటీ అవుతారు. 27వ తేదీన రాలేగావ్ సిద్ధి చేరుకుని, సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో సమావేశమవుతారు. అక్కడి నుంచి షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుని, హైదరాబాద్ కు తిరిగి వస్తారు. ఆ తర్వాత 29 లేదా 30న బెంగాల్, బీహార్ పర్యటనకు సీఎం వెళ్లనున్నారు.