ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్

ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు సీఎం కేసీఆర్. ఐదు ప్రగతి వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్రం, ఉత్సాహ పూరిత వాతావరణంలో ఆరో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా యావత్ ప్రజానీకానికి శుభాకాంక్షలు అని అన్నారు. దేశ చరిత్రలోనే అపూర్వ మహోద్యమాన్ని సాగించి, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో పరుగులు పెడుతుందన్నారు. అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అత్యంత కీలకమైన తొలి ఐదు సంవత్సరాల్లో బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన, సరైన అడుగులు పడ్డాయని చెప్పారు.

ప్రజలకు మెరుగైన సేవలు, పారదర్శవంతమైన పాలన అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలలో విస్తృతంగా భాగస్వాములు కావాలని ప్రజలకు  పిలుపునిచ్చారు. సంఘటిత శక్తిని ప్రదర్శించి, ఫలితాలు సాధించుకున్న స్వీయానుభవం కలిగిన తెలంగాణ సమాజం, అదే స్ఫూర్తితో నిర్ధేశిత లక్ష్యాలను సాధించగలుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం తమ ప్రాణాలను బలిపెట్టిన అమరవీరులకు  హృదయ పూర్వక నివాళులు అర్పించారు సీఎం కేసీఆర్.