ఇయ్యాల మానుకోటకు కేసీఆర్

ఇయ్యాల మానుకోటకు కేసీఆర్
  • సీఎం టూర్​కు పకడ్బందీ ఏర్పాట్లు
  • దగ్గరుండి పర్యవేక్షించిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు
  • భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
  • పార్టీ ఆఫీస్, కలెక్టరేట్ ఓపెనింగ్ కు అంతా రెడీ

మహబూబాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ నేడు మానుకోటకు రానున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఓపెనింగ్, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు ఆఫీసర్లు పూర్తి చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతిరాథోడ్ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం ఆఫీసర్లకు సూచనలు, సలహాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎంవో..

కేసీఆర్ టూర్ కు సంబంధించిన షెడ్యూల్ ను సీఎం కార్యాలయం బుధవారం విడుదల చేసింది. ఉదయం 11 గంటలకు పట్టణ శివారు తాళ్లపూసపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు కేసీఆర్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు వెళ్తారు. పార్టీ ఆఫీసు ఓపెనింగ్ అనంతరం 11.40 గంటలకు కలెక్టరేట్ కు చేరుకుంటారు. కలెక్టరేట్ ప్రారంభించాక ఆఫీసర్లతో మాట్లాడుతారు. మధ్యాహ్నం 1.25 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం వెళ్తారు.

ముస్తాబైన పట్టణం..

కేసీఆర్ టూర్ సందర్భంగా మానుకోట పట్టణాన్ని ముస్తాబు చేశారు. రోడ్ల వెంట మొక్కలు నాటి ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. డివైడర్లు, గోడలకు రంగులు వేశారు. ఆఫీసర్లు రేయింబవళ్లు శ్రమించి పనులు చేయిస్తున్నారు. అదనపు సిబ్బందిని కేటాయించి వీధుల్ని శుభ్రం చేస్తున్నారు. పోలీసులు 1600 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం సైతం మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, జడ్పీ చైర్ పర్సన్ ఆంగోత్ బిందు, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్​రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి తదితరులు ఏర్పాట్లు పరిశీలించారు.

కొత్తగూడ, వెలుగు: సీఎం కేసీఆర్ మహబూబాబాద్ టూర్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రతిపక్షాల నాయకులు, వివిధ సంఘాల లీడర్లను ముందస్తు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి అదుపులోకి తీసుకుని, స్టేషన్ కు తరలించారు. ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకునే అవకాశం ఉందనే నెపంతో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, తమను అకారణంగా అరెస్ట్ చేయడంపై ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్, బీజేపీ, తుడుందెబ్బ, ఆదివాసీ సంఘాల లీడర్లు ఉన్నారు.