సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపండి

సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు  ఆమోదం తెలపండి
  • రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
  • ఢిల్లీ రైల్వే భవన్​లో కేంద్ర మంత్రితో ప్రత్యేకంగా భేటీ 
  • రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ
  • కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సీఎంవో ప్రకటన

న్యూఢిల్లీ, వెలుగు:రాష్ట్రంలో సెమీ కండక్టర్‌‌‌‌ ప్రాజెక్టులకు త్వరితగతిన ఆమోదం తెలపాలని కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​కు సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, ప్రపంచ స్థాయి పరిశోధన, అభివద్ధి కేంద్రాలు తెలంగాణలో ఉన్నాయని కేంద్ర మంత్రికి వివరించారు. అందువల్ల ప్రతిపాదిత అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ ఇన్‌‌‌‌ ప్యాకేజీ టెక్నాలజీస్‌‌‌‌ (ఏఎస్‌‌‌‌ఐపీ) ప్రాజెక్ట్, మైక్రో ఎల్‌‌‌‌ఈడీ డిస్‌‌‌‌ప్లే ఫ్యాబ్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ క్రిస్టల్‌‌‌‌ మ్యాట్రిక్స్‌‌‌‌కు తెలంగాణలో ఆమోదం తెలపాలని కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని రైల్వే భవన్ లో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో సీఎం రేవంత్ రెడ్డి​ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రులు శ్రీధర్‌‌‌‌ బాబు, ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, కిరణ్‌‌‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి, రఘువీర్‌‌‌‌ రెడ్డి, రఘురాంరెడ్డి, సురేశ్‌‌‌‌ షెట్కార్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌‌‌‌ కుమార్, ఆర్‌‌‌‌ అండ్‌‌‌‌ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌‌‌‌ రాజ్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్‌‌‌‌ ఉప్పల్‌‌‌‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్‌‌‌‌ ఎలక్ట్రానిక్స్‌‌‌‌ పార్క్‌‌‌‌ ఏర్పాటుకు ఈఎంసీ 2.0 పథకం కింద తెలంగాణ వినతిని కేంద్ర మంత్రి దృష్టికి 
తీసుకెళ్లారు. రీజినల్‌‌‌‌ రింగు రోడ్డు సమీపంలో కొత్త ఎలక్ట్రానిక్‌‌‌‌ మాన్యుఫ్యాక్చరింగ్‌‌‌‌ పార్క్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. 

ట్రిపుల్​ఆర్​కు సమాంతరంగా రీజినల్​రింగ్​రైలు

రాష్ట్రంలో రైల్వే అనుసంధానత పెంపు కోసం నూతన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని అశ్వినీ వైష్ణవ్‌‌‌‌ను సీఎం రేవంత్‌‌‌‌ కోరారు. హైదరాబాద్‌‌‌‌ రీజినల్‌‌‌‌ రింగు రోడ్డుకు సమాంతరంగా రీజినల్‌‌‌‌ రింగ్‌‌‌‌ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించామని.. ఇందుకు రైల్వే బోర్డు ఇప్పటికే ఫైనల్‌‌‌‌ లొకేషన్‌‌‌‌ సర్వేకు అనుమతి ఇచ్చిందన్నారు. రూ.8 వేల కోట్ల విలువైన రీజినల్‌‌‌‌ రింగ్‌‌‌‌ రైలు ప్రాజెక్ట్‌‌‌‌కు త్వరగా అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ‘రీజినల్‌‌‌‌ రింగ్‌‌‌‌ రైలుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానత పెరగడంతో పాటు హైదరాబాద్‌‌‌‌ నగరంలోని ప్రధాన స్టేషన్లలో ట్రాఫిక్‌‌‌‌ రద్దీ తగ్గుతుంది. రీజినల్‌‌‌‌ రింగు రైలు ప్రాజెక్టుతో గ్రామీణ పేదరికం తగ్గడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. హైదరాబాద్‌‌‌‌ డ్రైపోర్ట్‌‌‌‌ నుంచి బందరు ఓడ రేవుకు అనుసంధానంగా రైలుమార్గం మంజూరు చేయాలి. ఔషధాలు, ఎలక్ట్రానిక్‌‌‌‌ పరికరాలు, ఫుడ్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌ ఉత్పత్తుల ఎగుమతులకు ఈ మార్గం దోహదపడుతుంది’అని వివరించారు.

కాజీపేట రైల్వే డివిజన్‌‌‌‌ 
ఏర్పాటు చేయాలి

కాజీపేట రైల్వే డివిజన్‌‌‌‌ అంశాన్ని కేంద్ర మంత్రితో సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ఆపరేషన్స్‌‌‌‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కాజీపేట రైల్వే డివిజన్‌‌‌‌ అవసరమని తెలిపా రు. ప్రయాణికులకు భద్రత, వేగవంతమైన సేవలు అందించేందుకు కాజీపేట రైల్వే డివిజన్‌‌‌‌ ఏర్పాటు చేయాలి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ‘తెలంగాణలో వివిధ ప్రాంతాల అనుసంధానత, పారిశ్రామిక, వ్యవసాయక ఎగుమతులు, దిగుమతుల కోసం వెనుకబ డిన ప్రాంతాల అభివద్ధికి నూతన రైలు మార్గా లు మంజూరు చేయండి. ఇందులో భాగంగా వికారాబాద్‌‌‌‌- కృష్ణా (122 కి.మీ. అంచనా వ్యయం రూ.2,677 కోట్లు), కల్వకుర్తి – మాచర్ల (100 కి.మీ.-అంచనా వ్యయం రూ.2 వేల కోట్లు, డోర్నకల్‌‌‌‌ – గద్వాల (296 కి.మీ.-అంచనా వ్యయం రూ.6,512 కోట్లు), డోర్నకల్‌‌‌‌- మిర్యాలగూడ (97 కి.మీ.-అంచనా వ్యయం 2,184 కోట్లు) మార్గాలను వంద శాతం రైల్వే శాఖ వ్యయంతో మంజూరు చేయండి’అని సీఎం రేవంత్‌‌‌‌ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌‌‌కు విజ్ఞప్తి చేశారు. కాగా.. ఈ అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సీఎంఓ వర్గాలు తెలిపాయి.