హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-2 మంజూరు చేయండి..కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-2 మంజూరు చేయండి..కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-2కు వెంటనే అనుమ‌తులు మంజూరు చేయాల‌ని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.జూన్ 19న ఢిల్లీలో ఖట్టర్ తో సమావేశమైన రేవంత్ రెడ్డి.  అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైద‌రాబాద్ లో 76.4 కిలోమీట‌ర్ల పొడ‌వైన మెట్రో ఫేజ్‌-2 అవ‌స‌రం ఎంతో ఉంద‌ని  కేంద్ర మంత్రికి తెలియజేశారు. ఫేజ్ 2 అనుమతిపై  ఇప్పటికే పలుమార్లు ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేశారు  సీఎం రేవంత్. 


రూ.24,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో క‌లిసి ఉమ్మడి  ప్రాజెక్టుగా చేప‌ట్టేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని వివ‌రించారు. మెట్రో ఫేజ్‌-2 సాకార‌మైతే న‌గ‌రంలో రాక‌పోక‌లు వేగంగా సాగ‌డంతో పాటు ర‌హ‌దారుల‌పై ర‌ద్దీ త‌గ్గుతుంద‌ని.. సుస్థిరాభివృద్ధికి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌ని రేవంత్  తెలిపారు.  హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-2 ఆవ‌శ్యకతను  దృష్టిలో ఉంచుకొని ఇత‌ర శాఖ‌ల నుంచి అవ‌స‌ర‌మైన అనుమ‌తులు ఇప్పించాల‌ని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.

డీపీఆర్ పూర్తయిన వాటిలో నాగోల్-ఎయిర్​పోర్టు, రాయదుర్గం-కోకాపేట నియోపోలీస్, ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట (ఓల్డ్ సిటీ మెట్రో), మియాపూర్-పఠాన్​చెరు, ఎల్బీనగర్-హయత్​నగర్ కారిడార్లు ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తం 76.2 కిలోమీటర్ల మార్గానికి గాను రూ.24,269 కోట్లు ఖర్చవుతుందని హెచ్ఎంఆర్ఎల్ అంచనా వేసింది.  ఆరో కారిడార్ అయిన ఎయిర్ పోర్టు-ఫోర్త్ సిటీ మార్గంలో 40 కిలోమీటర్లకు గాను రూ.8,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. మెట్రో మొదటి ఫేజ్ లో మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు రెండో ఫేజ్ పూర్తయితే మొత్తం 9 కారిడార్లలో 185 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి రానుంది.