
- స్థానిక సంస్థల ఎన్నికలు జల్ది నిర్వహించాలి
- ఎన్నికలు లేట్ అయితే కేంద్రం నిధులు ఆగిపోతాయ్
- వారం రోజుల్లో మరోసారిసమావేశమై నిర్ణయం
- రిజర్వేషన్ల పెంపు, పంచాయతీ ఎన్నికలపై ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల పెంపుపై సెక్రటేరియెట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించిన వివరాలను సీఎం అధికారుల నుంచి తెలుసుకున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం, రానున్న పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతున్న తీరును సీఎంకు అధికారులు వివరించారు.
ఇప్పటికే కుల గణనకు ఆమోదం తెలిపినందున, దాని ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందని, అందుకు ఎంత సమయం పడుతుందని సీఎం అధికారులను ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. త్వరగా ఆయా అంశాలపై రిపోర్టు రెడీ చేస్తే అసెంబ్లీ సమావేశాలకు ముందే మారోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుందామని సీఎం అన్నారు.
ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్లపై స్టడీ
సమావేశంలో మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల వరకు అనుసరించిన విధానాలు, వివిధ రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసులు, వాటి తీర్పులు, పర్యవసానాలను వివరించారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు ఇప్పటి వరకు అనుసరించిన విధానాలపై కాల క్రమ పట్టిక రూపొందించాలని, ఏవైనా సందేహాలు వస్తే మాజీ మంత్రి జానారెడ్డితో పాటు పంచాయతీరాజ్ శాఖ నిపుణులు, మాజీ ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాలని, చట్టపరమైన విషయాల్లో అడ్వకేట్ జనరల్ తో చర్చించాలని సూచించారు. మిగతా రాష్ట్రాలు రిజర్వేషన్ల విషయంలో అనుసరిస్తున్న అంశాలపై స్టడీ చేయాలని ఆదేశించారు.
కుల గణన ఆలస్యం కావొద్దు
కర్నాటకలో 2015లో, బిహార్లో 2023లో కుల గణన చేశారని, ఏపీలో కుల గణన చేసినా వివరాలు ఇంకా బయటపెట్టలేదని అధికారులు సీఎంకు వివరించారు. 2011లో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన కుల గణన ఫార్మాట్ 53 కాలమ్స్తో ఉందని, దానికి మరో మూడు కాలమ్స్ జోడించి కుల గణన చేపడితే కనీసం అయిదున్నర నెలల సమయం పడుతుందని అధికారులు వివరించారు. అయితే.. అంత ఆలస్యం కావొద్దని సీఎం స్పష్టం చేశారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, సీఎం సెక్రటరీ డాక్టర్ జి.చంద్రశేఖర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి డి.ఎస్.లోకేశ్ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి రెండ్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.