బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను కేంద్రం టార్గెట్ చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపించారు. కొడంగల్ నివాసంలో పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులతో సమావేశమైన ఆయన.. కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లను టార్గెట్ చేస్తూ ఎస్ఐఆర్ (SIR) పేరుతో బీజేపీ ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర, బీహార్, బెంగాల్ ఎన్నికల్లో ఇదే వ్యూహంతో గెలిచిన బీజేపీ.. ఇప్పుడు తెలంగాణలోనూ దొంగదెబ్బ తీయాలని చూస్తోందని ఆరోపించారు. గతంలో ఈడీ, సీబీఐలను ఉపయోగించిన కేంద్రం.. ఇప్పుడు ఓట్ల తొలగింపు ద్వారా తడిగుడ్డతో గొంతు కోసే చర్యలకు దిగుతోందని విమర్శించారు. కాంగ్రెస్ను దెబ్బకొట్టేందుకు బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇస్తోందని మండిపడ్డారు.
తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను చూస్తూ ఊరుకునేది లేదన్న సీఎం రేవంత్.. కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతీ బూత్లోనూ ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందన్నారు. గ్రామాల వారీగా బీఎల్ఏలను సమన్వయం చేసుకుంటూ, పేదల ఓట్లు తొలగించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
