నేడు మేడిగడ్డకు సీఎం, మంత్రులు.. అన్ని పార్టీలకు ఆహ్వానం

నేడు మేడిగడ్డకు సీఎం, మంత్రులు.. అన్ని పార్టీలకు ఆహ్వానం

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పర్యటన

  • ఉదయం 10‌‌‌‌:15 గంటలకు అసెంబ్లీ నుంచి బస్సుల్లో ప్రయాణం 
  • అన్ని పార్టీలకు సర్కార్ ఆహ్వానం.. హాజరుకావడం లేదన్న బీఆర్ఎస్ నేతలు

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ పర్యటనకు సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత సభ వాయిదా పడుతుంది. అనంతరం 10:15 గంటలకు ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీ నుంచి బయల్దేరుతారు. భువనగిరి, జనగామ, హనుమకొండ మీదుగా జయశంకర్​భూపాలపల్లి జిల్లా అంబట్​పల్లిలోని మేడిగడ్డ బ్యారేజీకి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. మేడిగడ్డలో దెబ్బతిన్న ఏడో బ్లాక్​లోని పిల్లర్లతో పాటు మొత్తం బ్యారేజీని పరిశీలిస్తారు. 

అక్కడే ఇరిగేషన్​అధికారులు, ఇంజనీర్లతో రివ్యూ చేస్తారు. ఇంజనీర్లు బ్యారేజీ కుంగుబాటుపై ప్రజంటేషన్​ఇస్తారు. ఆ తర్వాత సీఎం, మంత్రులు మీడియాతో మాట్లాడతారు. సాయంత్రం 5 గంటలకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తిరిగి హైదరాబాద్​కు బయల్దేరుతారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు రావాలని ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి అన్ని పార్టీల ఫ్లోర్​లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖ రాశారు. ఈ పర్యటనకు రావాలని కేసీఆర్​ను ఆహ్వానించారు. కాగా, కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై బీఆర్ఎస్ పార్టీ మంగళవారం ‘చలో నల్గొండ’ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులెవరూ మేడిగడ్డ పర్యటనకు వెళ్లడం లేదని ఆ పార్టీ ముఖ్య నేతలు తెలిపారు.