
న్యూఢిల్లీ, వెలుగు:హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కృష్ణ మీనన్ మార్గ్ 3లోని కేంద్రమంత్రి నివాసంలో జరిగిన ఈ భేటిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు 20 నిమిషాలకు పైగా సాగిన ఈ సమావేశంలో హైదరాబాద్ అభివృద్ధి, మెట్రో విస్తరణ, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మెట్రో ఫేజ్–2 అవసరాన్ని కేంద్రమంత్రి దృష్టికి సీఎం రేవంత్ తీసుకెళ్లారు.
‘‘వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో మెట్రో విస్తరణ అవసరం ఎంతో ఉంది. 76.4 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టుకు రూ.24,269 కోట్లు ఖర్చవుతుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మెట్రో ఫేజ్ 2 పూర్తయితే నగరంలో రాకపోకలు వేగంగా సాగడంతో పాటు రహదారులపై రద్దీ తగ్గుతుంది. సిటీ సుస్థిరాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది” అని వివరించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సూచన మేరకు అవసరమైన సవరణలు చేసి ప్రాజెక్టు డీపీఆర్ను సమర్పించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని అవసరమైన అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
మేమంతా ఒకే స్కూల్: రేవంత్
జిల్లాకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమయ్యారు. అయితే అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్, జితేందర్ రెడ్డి, ఇతర నేతలు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నగేశ్, పాయల్ శంకర్ను చూస్తూ.. ‘వాళ్లిద్దరూ, నేను, జితేందర్ రెడ్డి ఒకే స్కూల్(టీడీపీ) నుంచి వచ్చాం’ అంటూ కేంద్రమంత్రి ఖట్టర్కు సీఎం రేవంత్ చెప్పారు. దీంతో ఖట్టర్తో పాటు అక్కడున్న నేతలంతా సరదాగా నవ్వుకున్నారు. అనంతరం కేంద్రమంత్రి స్పందిస్తూ... ‘ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా, ఎవరి పని వాళ్లు చేయాల్సిందే. ఎవరి బాధ్యతలు వాళ్లు నెరవేర్చాల్సిందే’ అని అన్నారు.