
- ఈ నెల 9న అపాయింట్మెంట్ లెటర్లు: సీఎం రేవంత్రెడ్డి
- నేటి నుంచి 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
- 55 రోజుల్లోనే డీఎస్సీ రిజల్ట్స్ ఇచ్చినం
- పిల్లలు తక్కువగా ఉన్న స్కూళ్లను మూసేయం
- వంద నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు
- విద్యారంగాన్ని కేసీఆర్ పట్టించుకోలె
- పదేండ్లలో కేవలం ఒక్కటే డీఎస్సీ వేసిండు
- ప్రజాపాలనలో ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: దసరా పండుగలోపే కొత్త టీచర్ల రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. పండుగకు ముందే ఆయా అభ్యర్థుల ఇండ్లలో పండుగ వాతావారణం నెలకొనేలా చూస్తామని చెప్పారు. డీఎస్సీ–2024 ఫలితాలను.. జిల్లాలు, పోస్టుల వారీగా జనరల్ ర్యాకింగ్ లిస్టును సోమవారం సెక్రటేరియెట్లో సీఎం రేవంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్ష నిర్వహించిన 55 రోజుల్లోనే ఫలితాలు ఇచ్చామని, దీనికి కృషి చేసిన విద్యాశాఖకు అభినందనలు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామని ప్రకటించారు.
ఉపాధ్యాయ వృత్తి అనేది ఉద్యోగం కాదని.. భావోద్వేగమని చెప్పారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగమనే అంశం కీలకంగా ఉంది. నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం సాగింది. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ” అని సీఎం తెలిపారు.సింగిల్ టీచర్లున్న స్కూళ్లను గత సర్కారు మూసేస్తే.. తాము ఒక్కొక్కటి తెరుస్తున్నామని చెప్పారు. పిల్లలు తక్కువగా ఉన్నా ఆ స్కూళ్లను మూసివేయబోమని సీఎం స్పష్టం చేశారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో ఒక్కసారే డీఎస్సీ
కేసీఆర్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో ఒకసారి మాత్రమే డీఎస్సీ నిర్వహించిందని, అది కూడా 7,857 పోస్టులనే భర్తీ చేసిందని సీఎం రేవంత్ అన్నారు. పదేండ్లలో కేసీఆర్ విద్యాశాఖను పట్టించుకోలేదని, తమ ప్రజాపాలనలో విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. పేదలకు విద్యను అందించాలనే ఆలోచన గత కేసీఆర్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. విద్యకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని, అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే డీఎస్సీ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నామని, తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శమని పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వం విద్యాశాఖను నిర్లక్ష్యం చేసింది. ఇందుకు బడ్జెట్ కేటాయింపులు తక్కువగా చేసేది.
మేం అధికారంలోకి వచ్చాక విద్యా శాఖకు నిధుల కేటాయింపు పెంచాం. భవిష్యత్లో నిధులు మరింతగా కేటాయిస్తాం” అని తెలిపారు. గత ప్రభుత్వం కోళ్ల షెడ్లు, అద్దె గృహాల్లో విద్యార్థులకు వసతి గృహాలు ఏర్పాటు చేసిందని, కనీస మౌలిక వసతులు కల్పించలేదని మండిపడ్డారు. ప్రస్తుతం ఆయా వసతిగృహాల్లో ఎదురవుతున్న సమస్యలపై కొన్ని పార్టీలకు చెందిన మీడియాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, పదేండ్లు ప్రభుత్వంలో ఉన్నవాళ్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతోనే ఆ సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. విద్యపై పెట్టేది ఖర్చు కాదని..పెట్టుబడి అని తాము భావిస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
వంద నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు
రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో వసతులు కల్పించడమే తమ సర్కారు లక్ష్యమని సీఎం చెప్పారు. ఏండ్ల నుంచి పెండింగ్లో ఉన్న టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను పూర్తి చేశామన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా తెలంగాణవ్యాప్తంగా వంద నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు వేర్వేరుగా ఉండడంతో పిల్లల్లో ఆత్మనూన్యత భావం ఏర్పడేదని, దానిని తొలగించి వారి సమగ్ర వికాసానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో రూ.వంద కోట్లతో ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైందని, ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఉంటాయని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సీఎస్ శాంతికుమారి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ కె.లింగయ్య పాల్గొన్నారు.
1 నుంచి 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
డీఎస్సీ– 2024లో మెరిట్ ఆధారంగా మంగళవారం నుంచి అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను చేపట్టున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి ప్రకటించారు. వివిధ కేటగిరీల్లో ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 1 నుంచి 5 వరకు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటలమధ్య జిల్లాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో పాల్గొనాలని సూచించారు. 1: 3 రేషియోలో ఎంపికైనఅభ్యర్థుల షార్ట్ లిస్టును డీఈఓలు రిలీజ్ చేస్తున్నారని.. ఆ అభ్యర్థులకు మెసేజ్, ఈ–మెయిల్ ద్వారా సమాచారం కూడా పంపిస్తున్నట్టు వెల్లడించారు.
ఏడాదిలోనే 65 వేల ఉద్యోగాల భర్తీ
ప్రజాప్రభుత్వం 11,062 పోస్టులకు డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేసిందని సీఎం రేవంత్ తెలిపారు. ఒక్కో పోస్టుకు 1: 3 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసి, నిరుద్యోగులకు అండగా నిలబడ్డామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1, 2, 3 పోస్టులను అంగడి సరుకుల్లా మార్చేస్తే.. తాము అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. ప్రస్తుతం ఎటువంటి లోపాలు లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొత్తంగా సర్కారు ఏర్పడిన ఏడాదిలోనే 60 వేల నుంచి 65వేల ఉద్యోగాలను భర్తీ చేసి, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తున్నామని వివరించారు.