కరీంనగర్/గండిపేట, వెలుగు: చీరలను అడ్డుకట్టి గర్భిణికి డెలీవరీ చేసిన ఆర్టీసీ మహిళా సిబ్బందిని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా అభినందించారు. ఒడిశాకు చెందిన వలస కూలీ కుమారి, ఆమె భర్త దూలతో కలిసి పెద్దపల్లి జిల్లా కాట్నపల్లి ఇటుక బట్టీలో పనిచేస్తోంది. ఆదివారం సాయంత్రం కుంటకు వెళ్దామని కరీంనగర్ బస్టాండ్లో భద్రాచలం బస్సు ఎక్కేందుకు వచ్చారు. నిండు గర్భిణి అయిన కుమారికి బస్టాండ్లో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో బస్టాండ్లో ఉన్న ఆర్టీసీ మహిళా స్వీపర్లు, సూపర్వైజర్లు చీరలు అడ్డుకట్టి డెలివరీ చేశారు. కుమారి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై సీఎం స్పందించారు. ‘‘కరీంనగర్ బస్ స్టేషన్ లో గర్బిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న టీజీఎస్ఆర్టీసీ మహిళా సిబ్బందికి నా అభినందనలు. మీరు సకాలంలో స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. విధి నిర్వహణలో కూడా మీరు ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను”అని పోస్ట్ చేశారు. ఆ పోస్టుకు వీ6 వెలుగులో వచ్చిన న్యూస్ ఐటెంను ట్యాగ్ చేశారు. సీఎం అభినందించడంపై ఆర్టీసీ మహిళా సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, వారిని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ కూడా అభినందించారు.
శభాష్.. సురేశ్
విధి నిర్వహణతోపాటు సేవాగుణంతో విద్యార్థినికి సాయం చేసిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆదివారం యూపీఎస్సీ పరీక్ష రాసేందు కు వెళ్తున్న ఓ మహిళా అభ్యర్థి మైలార్దేవ్పల్లి పల్లెచెరువు బస్టాప్ వద్ద దిగింది. అప్పటికే ఆలస్యం కావడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సురేశ్ ఆమెను తన బైక్పై ఎక్కించుకొని ఎగ్జామ్ సెంటర్కు తీసుకెళ్లాడు. ఆ వీడియో వైరల్గా మారి సీఎం రేవంత్రెడ్డి వరకు చేరింది. ఈ సందర్భంగా సీఎం ఎక్స్ వేదికగా సురేశ్ను అభినందించారు. ‘వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా.. సాటి మనిషికి సాయం చేయడం బాధ్యత అని భావించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్కు నా అభినందనలు. సురేశ్ సహకారంతో సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకున్న సోదరి యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా. ఆల్ ది బెస్ట్’’ అని పోస్ట్ చేశారు.
