
- ఎన్డీఎఫ్కు అందజేస్తున్నట్లు ప్రకటన
- మిగతా నేతలు, పౌరులు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపు
దేశ సరిహద్దులను, ప్రజలను రక్షించేందుకు కృషి చేస్తున్న సాయుధ బలగాలకు సీఎం రేవంత్ రెడ్డి తన ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. నేషనల్ డిఫెన్స్ ఫండ్ (ఎన్డీఎఫ్)కు అందజేయనున్నట్లు శుక్రవారం ఎక్స్లో ట్వీట్ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని, విరాళాలు అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
‘‘నేను ఒక నెల జీతాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నా సహచరులు, పార్టీ సభ్యులు, పౌరులు కూడా ఈ డ్రైవ్లో చేరాలని కోరుతున్నాను. దేశం కోసం అందరం ఐక్యంగా నిలబడాలి” అని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. నేషనల్ డిఫెన్స్ ఫండ్ 1962లో స్థాపించబడింది. ఇది సాయుధ బలగాలు, వారి కుటుంబాల సంక్షేమం కోసం స్వచ్ఛంద విరాళాలను స్వీకరిస్తుంది. ఈ విరాళాలు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80(జీ) కింద పన్ను మినహాయింపును కలిగి ఉంటాయి.