హైదరాబాద్, వెలుగు: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి క్రిస్టియన్ సోదరులకు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఏసు ప్రభువు బోధనలను అనుసరించి అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
క్రిస్టియన్ మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. ఏసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని చెప్పారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని, ఏసు ప్రభువు ఎంచుకున్న మార్గం ఆదర్శనీయమని పేర్కొన్నారు.
