- అల్లుడిని పంపించి అబద్ధాలు చెప్పిస్తున్నడు
- కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- ఆయన సభకు రాకపోవడం ప్రజలను అవమానించడమే
- తప్పు చేసిండు కాబట్టే ముఖం చాటేస్తున్నడు
- సభకు వచ్చి కృష్ణా జలాలపై వైఖరేంటో చెప్పాలి
- ఇకనైనా దొంగలకు సద్ది మూట మోసే బుద్ధి మార్చుకోవాలని హితవు
హైదరాబాద్, వెలుగు : ముఖ్యమంత్రిగా పదేండ్లు పాపాలు చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఫామ్హౌస్లో దాక్కున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆ పాపాల భైరవుడు అసెంబ్లీకి వచ్చి, కృష్ణా జలాల విషయంలో ఆయన వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘కేసీఆర్ చేపల పులుసు కోసం ఆశపడి, మన నీళ్లు దోచుకుపోవడానికి ఏపీకి అలుసు ఇచ్చారు. చేయకూడని తప్పులన్నీ చేసి, సభకు రాకుండా ఫామ్హౌస్లో దాక్కున్నారు. సభకు అల్లుడిని పంపించి పచ్చి అబద్ధాలు ఆడిస్తున్నారు” అని మండిపడ్డారు. ఇప్పటికైనా దొంగలకు సద్ది మూట మోసే బుద్ధి మార్చుకుని, తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. సోమవారం అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ.. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని పదేపదే ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హరీశ్ రావుకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తామని ఒప్పుకున్నదే గత బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. అప్పటి సీఎం కేసీఆర్కు ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఇరిగేషన్ ఇన్ చార్జ్ సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ గతేడాది డిసెంబర్ ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖను ఈ సందర్భంగా సభలో చదివి వినిపించారు.
“2021 జులై 15వ తేదీన నోటీఫై చేసిన గెజిట్ ప్రకారం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను అప్పగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విషయం మీకు(కేంద్రానికి) కూడా తెలుసు. ఆపరేషనల్ ప్రొసీజర్స్ వల్ల ఆలస్యమైంది. అంతే తప్ప ప్రాజెక్టుల అప్పగింతకు మేము (కేసీఆర్ సర్కార్) వ్యతిరేకం కాదు. కానీ ఏపీ పోలీసులు నాగార్జునసాగర్కు వచ్చి బలవంతంగా నీళ్లు తీసుకుపోతున్నరు. ఈ విషయంలో మీరు చర్యలు తీసుకోవాలి” అని కేంద్రానికి స్మితా సబర్వాల్ లేఖ రాశారని వెల్లడించారు. ప్రాజెక్టుల అప్పగింతకు కేసీఆర్ ఒప్పుకున్న విషయం ఈ లేఖ ద్వారా స్పష్టమవుతున్నదని తెలిపారు. అందుకే కేసీఆర్ సభకు రాకుండా మొహం చాటేసి, ఫామ్హౌస్ లో ఉన్నారని ఫైర్ అయ్యారు.
గెలిపిస్తే మోసం చేసిండు..
కేసీఆర్ ను పాలమూరు ప్రజలు ఎంపీగా గెలిపిస్తే, కృష్ణా జలాలను ఏపీకి అప్పగించి అదే ప్రజలను ఆయన మోసం చేశారని రేవంత్ మండిపడ్డారు. ‘‘కరీంనగర్ ప్రజలు కేసీఆర్ ను తరిమితే, 2009లో మహబూబ్నగర్కు వచ్చి పోటీ చేసిండు. వలస వచ్చిండు కదా పాపమని కేసీఆర్ను పాలమూరు ప్రజలు ఎంపీగా గెలిపిస్తే, కృష్ణా జలాలను ఏపీకి అప్పగించి అదే ప్రజలను మోసం చేసిండు” అని ఫైర్ అయ్యారు. ‘‘మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కృష్ణా నది జలాలపై ఆధారపడే మనం జీవిస్తున్నాం. ఇప్పుడు ఆ జిల్లాలకు జీవనాడి అయిన కృష్ణా నది జలాలకు సంబంధించిన చర్చ జరుగుతుంటే.. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్హౌస్లో దాక్కున్నడు. సభకు రాకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమే. ఇంతకంటే కీలక అంశం రాష్ట్రంలో ఏమైనా ఉన్నదా? కృష్ణా జలాల్లో 68 శాతం వాటా తెలంగాణకు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు... ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వచ్చి సంపూర్ణ మద్దతు తెలిపి, ఒకే మాట మీద ఉన్నామని ఏపీకి, కేంద్రానికి సందేశం ఇవ్వాలి కదా” అని అన్నారు.
హరీశ్ చెప్పేవన్నీ అబద్ధాలు..
‘‘బీఆర్ఎస్ ఓనర్, ప్రతిపక్ష నాయకుడు సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నడు. వీళ్లను పంపించిండు. వీళ్లకు, వీళ్ల మాటకు పార్టీలో విలువే లేదు. సభను తప్పుదోవ పట్టించడానికి హరీశ్ ప్రయత్నిస్తున్నడు. ఆయన నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెబుతూ, ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నడు. వీరి మాటల వల్ల, చర్యల వల్ల శత్రువుకు బలం చేకూరుతుంది. దొంగలకు సద్ది మూట మోసే విధానం మంచిది కాదు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించేది లేదని, కృష్ణా జలాల్లో తెలంగాణకు 68 శాతం వాటా ఇవ్వాలని తీర్మానం ప్రవేశపెట్టాం” అని డిమాండ్ చేశారు.