పదేండ్లు తెలంగాణను పాలించి సర్వనాశనం చేసినవ్ : సీఎం రేవంత్

పదేండ్లు తెలంగాణను పాలించి సర్వనాశనం చేసినవ్ :  సీఎం రేవంత్

చావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రం తెచ్చిన అని ఇంకా ఎన్నిరోజులు చెప్తవ్​.. ఇప్పటికే  పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి సర్వనాశనం చేసినవ్.. మళ్లీ అబద్ధాలు చెప్పడం స్టార్ట్​చేసినవ్​’ అని కేసీఆర్​పై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ సత్య హరిశ్చంద్రుడు అయితే శాసనసభలో చర్చకు ఎందుకు రాలేదన్నారు. ‘మీరు చేసిన నిర్వాకంపై సభలో ఆధారాలతో సహా బయటపెట్టాం. మేడిగడ్డ సందర్శనకు రావాలని మా మంత్రి లేఖ రాశారు. మీకు 13వ తేదీపై అభ్యంతరం ఉంటే మీరు చెప్పిన తేదీనే వెళ్దామని చెప్పాం. కాలు విరిగిందని అసెంబ్లీకి రాని కేసీఆర్.. నల్లగొండ సభకు మాత్రం ఎలా వెళ్లారు?’ అని నిలదీశారు.  ‘కేఆర్‌‌ఎంబీపై తాను సలహాలు ఇచ్చేవాడినని కేసీఆర్ నల్గొండలో అంటున్నారు. సభకు వచ్చి సలహాలు ఇవ్వొచ్చని మేం ముందునుంచీ చెబుతున్నాం. తీర్మానంలో లోపాలు ఉంటే హరీశ్​ రావు ఎలా మద్దతు ఇచ్చారు. అందుకే వారి మాటలకు బీఆర్‌‌ఎస్‌‌ పార్టీలో విలువ లేదని, కేసీఆరే సభకు రావాలని మేం కోరాం. నల్లగొండ సభలో దిక్కుమాలిన మాటలు మాట్లాడటం కాదు.. శాసనసభకు రండి. వచ్చి సూచనలు సలహాలు ఇవ్వండి’ అని కేసీఆర్​కు సీఎం రేవంత్ సూచించారు.