ప్రియాంక గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రియాంక గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజిబిజిగా గడుపుతున్నారు.   ఇవాళ(జూలై 22) కాంగ్రెస్ జాతీయ  ప్రధాన కార్యదర్శి   ప్రియాంక గాంధీని కలిశారు . కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర  వ్యవహారాల ఇన్‌ఛార్జి దీప‌దాస్ మున్షీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ ,  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  ప్రియాంకతో సమావేశం అయ్యారు. నామినేటెడ్ పదవులు, కేబినెట్ విస్తరణ, వరంగల్ సభ గురించి ప్రియాంకతో నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.  

కాసేపట్లో  కాంగ్రెస్ చీఫ్​ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటికానున్నట్లు తెలిసింది‌‌. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలను వివరించడంతోపాటు.. రైతు రుణమాఫీ, రాష్ట్ర బడ్జెట్ సెషన్ లో ఉండబోయే కీలక అంశాలను వివరించే చాన్స్​ ఉంది.  అలాగే ఈ నెలాఖరులో వరంగల్ లో రైతు కృతజ్ఞత సభను నిర్వహించే అంశాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.

 ఈ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించినందున.. ఢిల్లీ పర్యటనలో రాహుల్​ను కలిసి ఆహ్వానించనున్నట్లు తెలిసింది. అగ్రనేతలతో భేటీకి ముందు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ తో రేవంత్  భేటీ కానున్నారు‌‌. ఈ సమావేశంలో  పీసీసీ కొత్త చీఫ్​ నియామకం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చించనున్నారు.

పలువురు కేంద్ర మంత్రులను కలిసే చాన్స్​

ఢిల్లీ పర్యటనలో పొలిటికల్ అంశాలతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం ఫోకస్ చేయనున్నారు. ఇందులో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నట్లు సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​, కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, జలశక్తి శాఖ, ఇతర శాఖల మంత్రుల అపాయింట్మెంట్లు కోరినట్లు సమాచారం.