ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు నిధులివ్వండి ... నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్

ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు నిధులివ్వండి ... నిర్మలా సీతారామన్‌తో  సీఎం రేవంత్

తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న కృషికి మద్దతివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామ‌న్‌ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.   తెలంగాణ‌లో సుమారు 90 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ‌ర్గాల్లోని పిల్లలకు  కార్పొరేట్ త‌ర‌హా విద్యును  అందించేందుకు త‌మ ప్రభుత్వం తీసుకుంటున్న చ‌ర్యలను  కేంద్ర మంత్రికి వివ‌రించారు రేవంత్ .

  ఢిల్లీ నార్త్ బ్లాక్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి  నిర్మలాసీతారామన్ తో  సమావేశమైన రేవంత్.. రాష్ట్రంలోని 105 శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించనున్నట్లు  తెలిపారు. ఇప్పటికే  నాలుగు పాఠ‌శాల‌ల నిర్మాణ ప‌నులు మొద‌ల‌య్యాయ‌ని, మిగ‌తా పాఠ‌శాల‌ల‌కు సంబంధించి టెండ‌ర్లు ముగిశాయ‌న్నారు. ఒక్కో పాఠ‌శాల‌లో 2,560 మంది విద్యార్థులు ఉంటార‌ని, 2.70 లక్షల మంది విద్యార్థుల‌కు ఈ పాఠ‌శాల‌ల్లో చదువుకునే అవ‌కాశం ల‌భిస్తుంద‌ని సీఎం వివరించారు.

 అత్యాధునిక వ‌స‌తులు, ల్యాబ్‌లు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల  కోట్ల ఖర్చు అవుతుందన్నారు. అలాగే రాష్ట్రంలో జూనియ‌ర్‌, డిగ్రీ, సాంకేతిక క‌ళాశాలలు, ఇత‌ర ఉన్నత విద్యా సంస్థల్లో  ఆధునిక ల్యాబ్‌లు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల క‌ల్పనకు రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు  కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. 

►ALSO READ | నిన్న మోహదీపట్నం.. ఇవాళ అమీర్‌ పేట‌లో.. రోబో టెక్నాలజీతో డ్రైనేజీ పూడిక తొలగింపు

ఈ నిధుల స‌మీక‌ర‌ణ‌కు ప్రత్యేక కార్పొరేష‌న్ ఏర్పాటుకు అనుమ‌తించ‌డంతో పాటు ఎఫ్ఆర్‌బీఎం ప‌రిమితి నుంచి మిన‌హాయించాల‌ని నిర్మలా సీతారామ‌న్‌ ను సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంపై చేస్తున్న వ్యయాన్ని పెట్టుబ‌డిగా ప‌రిగ‌ణించాల‌ని కోరారు. గ‌త ప్రభుత్వంలో అధిక వ‌డ్డీల‌కు అప్పులు తీసుకువ‌చ్చింద‌ని, వాటి చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారిన నేప‌థ్యంలో వాటి రీస్ట్రక్చరింగ్‌కు అనుమ‌తించాల‌ని కోరారు.  సీఎం రేవంత్ చేసిన  విజ్ఞప్తుల‌పై నిర్మలా సీతారామ‌న్ సానుకూలంగా స్పందించారు.