సర్కారు స్కూళ్ల స్టూడెంట్లకు 22 రకాల వస్తువులు : సీఎం రేవంత్రెడ్డి

సర్కారు స్కూళ్ల  స్టూడెంట్లకు 22 రకాల వస్తువులు : సీఎం రేవంత్రెడ్డి
  • సమ్మర్ హాలిడేస్ పూర్తయ్యేలోపు సరఫరా చేయాలి: సీఎం రేవంత్​రెడ్డి
  • నాణ్యతలో రాజీపడొద్దని అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న స్టూడెంట్లకు 22 రకాల వస్తువులు అందజేసేందుకు రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి గురుకుల స్టూడెంట్స్ తో పాటు సర్కారు స్కూళ్లలో చదువుతున్న స్టూడెంట్లందరికీ ఈ వస్తువులను సరఫరా చేయనున్నారు. అయితే, ఈ వస్తువుల నాణ్యత విషయంలో రాజీపడొద్దని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 

సమ్మర్ హాలిడేస్ పూర్తయ్యే లోపు వస్తువుల సరఫరా చేయాలన్నారు. సోమవారం జూబ్లీహిల్స్ లోని సీఎం  నివాసంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల విద్యార్థులకు అందించే వస్తువులకు సంబంధించి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పై ఎడ్యుకేషన్, వెల్ఫేర్ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల విషయంలో ఖర్చుకు వెనకాడొద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సీఎం తెలిపారు. యూనిఫామ్ తో పాటు 21 వస్తువులతో కూడిన కిట్ ను విద్యార్థులకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. 

స్కూల్ బెల్ట్, టై, షూస్, స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, ఇతర వస్తువులను అందించేందుకు అవసరమైన ప్రొక్యూర్మెంట్ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, స్పెషల్ సీఎస్ సబ్యసాచి ఘోష్,  సీఎం సెక్రటరీ వేముల శ్రీనివాసులు,  ఎస్టీ, ఎస్సీ సెక్రటరీలు  కృష్ణ ఆదిత్య, సీతాలక్ష్మి పాల్గొన్నారు.

ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ప్రతి 15 రోజులకు బిల్స్ రిలీజ్: డిప్యూటీ సీఎం భట్టి

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మన పిల్లలు ప్రపంచంతో పోటీపడేలా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వం డ్రీం ప్రాజెక్టు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ప్రజాభవన్ నుంచి జిల్లాల కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ ప్రగతిని కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. 

ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం పూర్తిచేసే బాధ్యత పూర్తిగా కలెక్టర్లదేనిని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. టెండర్లు పూర్తి అయినచోట మంత్రి లేదా స్థానిక ఎమ్మెల్యేతో భూమి పూజ చేయించాలని, భవనాల నిర్మాణం పూర్తికి గడువు ఖరారు చేయాలని ఆదేశించారు. కలెక్టర్లు ప్రతివారం స్కూళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్ష జరపాలని, నెలలో ఒకసారి నిర్మాణ ప్రదేశానికి వెళ్లి అక్కడే సమీక్ష చేయాలన్నారు. స్కూల్స్ నిర్మాణంలో నిధులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదని.. ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్స్ రిలీజ్ చేస్తామని భట్టి స్పష్టం చేశారు.  

బిల్డింగ్స్ నిర్మాణంలో క్వాలిటీ చెక్ కోసం థర్డ్ పార్టీ ఏజెన్సీని ఏర్పాటు చేయాలన్నారు. పనుల ప్రగతిపై వారానికి ఒకసారి చీఫ్ సెక్రటరీ కలెక్టర్ల నుంచి నివేదిక తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ బలరాం నాయక్, సీఎస్​రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కార్పొరేషన్ ఎండీ గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.