ఎట్టి పరిస్థితుల్లో మూసీ ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్.. 2026 మార్చిలో మూసీ ఫస్ట్ ఫేజ్ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. గండిపేట్ నుంచి బాపూ ఘాట్ వరకు మొదట 21 కి.మీ మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పారు.సంక్రాంతి లోగా ఫస్ట్ ఫేజ్ డీపీఆర్ పై క్లారిటీ వస్తుందన్నారు. ఈ పనులకు ఏడీబీ బ్యాంకు రూ.4 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు.
‘నగరాల అభివృద్ధికి నదులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. బాపూఘాట్ దగ్గర మూసీ,ఈసా నదులు కలుస్తాయి. కాకతీయులు,నిజాం రాజులు కూడా నీటి వనరులు ఏర్పాటు చేశారు. అనంతగిరి దగ్గర మొదలై మూసీ నది మొత్తం 240 కి.మీ ప్రవహిస్తోంది. అనంతగరి హిల్స్ నుంచి వాడపల్లి వరకు మూసీ ప్రవహిస్తోంది. మూసీ ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నాం. మూసీ అభివృద్ధికి అనేక సమీక్షలు చేశాం. ప్రణాళిక బద్ధంగా మూసీని అభివృద్ధి చేస్తాం. జలవనరులను ఆగం చేసి ఫాంహౌస్ లు కట్టుకున్నారు. డ్రైనేజీలు కబ్జా పెట్టి , మొయినాబాద్ లో జన్వాడలో ఫాంహౌస్ లు కట్టుకున్నరు, వికారాబాద్ అడవుల్లో నిజాం వనమూలికలను పెంచారు. మూసీని బాగు చేస్తుంటే మాపై అన్ని రకాలుగా విమర్శలుచేస్తున్నారు. లక్షలు పెట్టి సోషల్ మీడియాలో మాపై బద్నాం చేయిస్తున్నారు. పేదలకు మంచి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. మూసీ అభివృద్ధి కోసం అనేక దేశాలు తిరిగాం.
ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన నగరాలు నదుల ఒడ్డునే ఉన్నాయి.గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. సబర్మతి అభివృద్ధి కోసం 60 వేల కుటుంబాలను తరలించారు.యూపీలో గంగానది అభివృద్ధి కోసం పేదలను తరలించారు. ఢిల్లీలో యమునా నది అభివృద్ధి చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మేం ఏ అభివృద్ధి చర్యలను వ్యతిరేకించడం లేదు.నిర్వాసితులకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నాం. మూసీ అభివృద్ధి జరిగింది అంటే నిజాం కాలంలోనే . మూసీ వల్ల నల్గొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు.ఫ్లోరైడ్ పాపానికి తోడు, మూసీ వల్ల నల్గొండ ప్రజలు చేతులు,కాళ్లు, నడుము వంకరతో నరకయాతన అనుభవిస్తున్నారు.. సిటీలోని మూసీ మురుగుతో నల్గొండ ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం’ అని రేవంత్ తెలిపారు.
