
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేస్తున్నామని.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా విగ్రహాన్ని రూపొందిస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రజాపాలన అందించామన్నారు. ధర్నా చౌక్ ను వద్దన్నవారు.. అక్కడే ధర్నా చేస్తే అనుమతిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ పెంచిన గంజాయి మొక్కలను పీకేస్తామన్నారు. ఆదివారం మీట్ ది మీడియా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరోసారి తీవ్రంగా విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల స్వేచ్ఛను కేసీఆర్ హరించారని.. వారిని బానిసలుగా భావించారని ఆయన ఫైరయ్యారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చిన తెలంగాణలో కేసీఆర్ నియంతగా వ్యవహరించారని మండిపడ్డారు.
కేసీఆర్ పాలన కూడా.. నిజాం నవాబుల పాలన వంటిదేనన్నారు రేవంత్ రెడ్డి. నిజాం కూడా సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. కాళేశ్వరం కట్టానని.. కళ్యాణలక్ష్మీ ఇచ్చానని చెప్పిన కేసీఆర్.. ప్రజల స్వేచ్ఛను హరించారని.. ధర్నా చౌక్ ను ఎత్తివేశారని చెప్పారు. సంక్షేమ పథకాలు ఇచ్చినా స్వేచ్ఛను హరిస్తే ప్రజలు ఊరుకోరని.. బానిసత్వాన్ని ప్రజలు వ్యతిరేకించారన్నారు సీఎం. పథకాలు ఇచ్చి ప్రజలు బానిసలుగా ఉండాలని కేసీఆర్ భావించారని... ప్రశ్నించినవారిని కేసీఆర్ అణచివేయాలని చూశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
2023, డిసెంబర్ 3వ తేదీకి, తెలంగాణ విముక్తికి ఉన్న ప్రాముఖ్యత ఉందని చెప్పారు రేవంత్. 75 ఏళ్ల తర్వాత డిసెంబర్ 3న తెలంగాణకు మరోసారి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. తెలంగాణ సంస్కృతిక వారసత్వాన్ని కేసీఆర్ నాశనం చేశారని మండిపడ్డారు. ఉద్యమంలో పాడిన జయ జయహే తెలంగాణ పాటను కేసీఆర్ నిషేధించారని... కువులు, కళాకారులను గడిలో బంధించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.