
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహం.. సీమాంధ్ర నేతలు చేసిన దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ అని విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చేసిన నేరానికి 1000 కొరడా దెబ్బలు కొట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రోళ్లకు పాలెగాడిలా కేసీఆర్ మారరా..? ఈ విషయం చర్చిద్దామంటే సభకు రారన్నారు. బుధవారం (జులై 9) ప్రజా భవన్లో కృష్ణా, గోదావరి జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పీపీటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని కేసీఆర్ సంతకం చేశారు. బేసిన్లు లేవు.. భేషజాలు లేవంటూ గోదావరి నీళ్లు కూడా రాయలసీమకు తరలించుకోండని జగన్కు సలహా ఇచ్చారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానని ప్రకటించిందే కేసీఆర్. కృష్ణా పరివాహక ప్రాంతంలో రైతులకు కేసీఆర్ మరణశాసనం రాశారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పాలనలో కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు.