ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా: సీఎం రేవంత్ రెడ్డి

ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా: సీఎం రేవంత్ రెడ్డి

యాదాద్రి భువనగిరి: ఎవరు అడ్డుపడ్డా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. గంధమల్ల రిజర్వాయర్‌ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు జిల్లాలో రూ.15 వందల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం తిర్మలాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో చేసిన పాదయాత్ర సమయంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజల కష్టాలు స్వయంగా చూశానని అన్నారు. నల్లగొండ రైతులకు మేలు కలిగేలా మూసీ ప్రక్షాళన చేస్తామని.. గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతామని అన్నారు. 

బీజేపీ నేతలు నర్మదా, గంగా నది ప్రక్షాళన చేసుకోవచ్చు.. తెలంగాణ ప్రజలు మాత్రం మూసీ నదిని ప్రక్షాళన చేసుకోవద్దా అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన చేస్తుంటే ఇళ్లు కూలగొడుతున్నామని అడ్డుపడ్డారని బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. ఇక్కడి మూసీ కాలుష్యంతో సంతానం కూడా కల్గని పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. మూసీ ప్రక్షాళన చేసి నది ఒడ్డున ఉండే పేదలను ఆదుకుంటామని చెప్పినా వాళ్లను రెచ్చగొట్టారని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన చేయకుండా బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. 

ఎంతో మంది మహానీయులు పుట్టిన జిల్లా నల్లగొండ. తెలంగాణ సాయుధ పోరాటంలో ఇక్కడి ప్రజలు ఎంతో చైతన్యంగా పోరాడారు. అలాంటి నల్లగొండ జిల్లాను గత బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఇకపై ప్రతిపక్షాలు పేదలు, రైతులను రెచ్చగొడితే నల్లగొండ జిల్లా ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. గంధమల్లను గత ప్రభుత్వం ఎందుకు పూర్తిచేయలేకపోయిందని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. ఎవరూ అడ్డుపడ్డా గందమళ్ల ప్రాజెక్ట్ పూర్తి తీసి తీరుతామని తేల్చి చెప్పారు. 

యాదగిరి గుట్ట నరసింహుడి ఆశీస్సులతో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. ప్రజల సంక్షేమంతో పాటు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తే యాదాద్రిని యాదగిరిగుట్టగా మారుస్తామని చెప్పినాం.. చెప్పినట్లుగానే పవర్‎లోకి వచ్చాక భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా  యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చామన్నారు. టీటీడీ తరహాలో వైటీడీ బోర్డు చేశామని.. త్వరలోనే వైటీడీ బోర్డును నియమిస్తామని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ యాదగిరిగుట్టపై ఆటోలను కూడా నిషేధించిందని.. గుట్టపై భక్తులు నిద్ర చేసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.