
హైదరాబాద్: భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ తెలంగాణ CM రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులను కాపాడుతూ, ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో వీరోచితంగా పోరాడుతున్న భారత సాయుధ దళాలకు మద్దతుగా స్ఫూర్తిదాయక చర్యకు శ్రీకారం చుట్టారు. భారత సాయుధ బలగాలకు సహకారంగా తన ఒక నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధి (National Defence Fund) కి విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు.
"మన దేశ ధీర సాయుధ దళాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు, మన సరిహద్దులను, ప్రజలను రక్షించేందుకు ప్రాణాలను పణంగా పెట్టి అందిస్తున్న అసమాన సేవలకు చిన్న సహకారంగా, ఒక భారతీయుడిగా నేను నా ఒక నెల జీతాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా అందిస్తున్నాను. ఈ పవిత్ర లక్ష్యంలో భాగస్వాములు కావాలని నా సహచరులు, పార్టీ నాయకులతో పాటు ప్రతి ఒక్క భారతీయుడిని ఆహ్వానిస్తున్నాను. మన సాయుధ దళాలకు అండగా నిలుద్దాం’’ అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.