
- కమిషన్కు ఈ నెల 30లోపు అన్ని ఆధారాలు ఇవ్వనున్న సర్కార్
- కేబినెట్ అనుమతి లేకుండానే కట్టారని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
- చిన్న ప్రాజెక్టులకే కేబినెట్లో చర్చించి ఆమోదించాకే ముందుకు
- ఇంత పెద్ద ప్రాజెక్టుకూ కేబినెట్ ఆమోదం తీసుకోకపోవడంపై విస్మయం
- అప్పటి పాత డాక్యుమెంట్లను బయటకు తీస్తున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: కోటి ఎకరాల మాగాణం.. మూడు బ్యారేజీలు.. 15 రిజర్వాయర్లు.. 21 పంప్హౌస్లు.. 1,531 కిలోమీటర్ల కాల్వలు.. 203 కిలోమీటర్ల టన్నెల్స్.. ఇదీ రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్పే మాటలు. కానీ, అంత పెద్ద ప్రాజెక్టును కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే కేవలం ‘నోటి మాట’ మీదనే నిర్మించడం అనేది షాకింగ్ విషయంగా మారింది. వాస్తవానికి ఒక్క చిన్న ప్రాజెక్టును నిర్మించాలంటేనే కేబినెట్లో చర్చించి, ఆమోదం పొంది.. దానికి ఒక రూపం తీసుకొస్తారు. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో 96 కేబినెట్ మీటింగ్లు జరిగినా.. ఒక్కసారి కూడా ఆమోదం తీసుకోలేదు.
కేబినెట్ అప్రూవల్ లేకుండానే రూ.లక్ష కోట్ల ప్రాజెక్టును గత కేసీఆర్ సర్కారు నిర్మించింది. అన్నీ తానై.. వందల గంటల మేధో మథనం చేసి.. మెదడును కరిగించి.. రక్తాన్ని రంగరించి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టానని ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పుకున్నారు. కానీ, కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ సాక్షిగా కేసీఆర్ అబద్ధాలు ప్రచారం చేశారు. ఆ ప్రాజెక్టు తన ఒక్కడి నిర్ణయం కాదని, కేబినెట్ మొత్తం ఆమోదించిందని కమిషన్కు స్పష్టంగా చెప్పారు. అయితే, అసలు ఆ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదమే లేదని తాజాగా తేటతెల్లమైంది.
బుధవారం బనకచర్లపై అఖిలపక్ష సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు కేబినెట్ అప్రూవలే లేదని కుండబద్దలు కొట్టేశారు. ‘‘తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు తరలింపుపై కేబినెట్ అప్రూవల్ లేదు. కాళేశ్వరం కమిషన్ఇటీవల వివరాలు అడిగింది. ఈ నెల 30లోపు ఇరిగేషన్ శాఖ అధికారులు ఆ వివరాలను కమిషన్కు అందజేస్తారు. అన్ని డాక్యుమెంట్లనూ ఇస్తారు. కేబినెట్ అప్రూవల్ ఉందని కేసీఆర్, హరీశ్రావు, ఈటల అబద్ధాలు చెప్పారు’’ అని సీఎం రేవంత్ తెలిపారు.
కమిషన్ లేఖతో..
కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఓపెన్ కోర్టు ఎంక్వై రీలో.. కేసీఆర్, హరీశ్, ఈటల దాదాపు ఒకేరకమైన సమాధానాలు చెప్పారు. ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం ఉందని తేల్చి చెప్పారు. అన్ని నిర్ణయాలనూ కేబినెట్లో చర్చించాకే ప్రాజెక్టుపై ముందుకు వెళ్లామని స్పష్టం చేశారు. దీంతో ఆ డాక్యుమెంట్లను సమర్పించాల్సిందిగా ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ వారం క్రితం లేఖ రాసింది.
వాస్తవానికి ఐఏఎస్ల విచారణ ముగిసిన వెంటనే ప్రాజెక్టు మీద కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి కమిషన్ లేఖ రాయగా.. వాటిని ప్రభుత్వం సమర్పించింది. తాజాగా ఆ ముగ్గురు నేతల స్టేట్మెంట్ల నేపథ్యంలో అదనపు డాక్యుమెంట్లు ఏవైనా ఉన్నా కూడా ఇవ్వాలని తాజా లేఖలో కమిషన్ కోరింది.
ఈ నేపథ్యంలోనే ఈ నెల 30లోపు ఆ డాక్యుమెంట్లన్నింటినీ కమిషన్కు సమర్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి అది పూర్తయి వాడుకలోకి తెచ్చినప్పటి వరకు కేబినెట్ తీసుకున్న నిర్ణయాల పాత డాక్యుమెంట్లను అధికారులు బయటకు తీశారు. మరిన్ని డాక్యుమెంట్లను వెలికితీసి కమిషన్కు సమర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇరిగేషన్ నిపుణుల విస్మయం..
లక్ష కోట్లు ఖర్చుపెట్టి కట్టిన భారీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం సైతం లేకపోవడంపై ఇరిగేషన్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ నాడు కేసీఆర్ మాటకు ఎదురుచెప్పే ధైర్యం లేక ఆయన ఏది చెప్తే దానికి మంత్రివర్గం తలూపిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్న అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్న కాంగ్రెస్, బీజేపీ నేతల ఆరోపణలకు బలం చేకూరుతున్నది.
ప్రాజెక్టులో వేల కోట్లు చేతులు మారి ఉంటాయని, అందులో భాగంగానే నిర్మాణ సంస్థలకు అయాచిత లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఆధారాలు సమర్పిస్తే.. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై కమిషన్ ఎలా స్పందిస్తున్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈ డాక్యుమెంట్ల ఆధారంగా కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్పై ఎలాంటి చర్యలను కమిషన్ సిఫార్సు చేస్తుందన్న విషయంపై చర్చ జరుగుతున్నది.