
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. కేటీఆర్ వెనకాల ఉన్న అక్కల మాట వినొద్దని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. వెల్ లోకి దూసుకొచ్చి ఆందోళన చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వచ్చారని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని తమ్ముడిగా పార్టీలోకి ఆహ్వానించానన్నారు. సీఎం రేవంత్ పదే పదే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు.
సబిత వ్యాఖ్యలకు బదులిచ్చిన రేవంత్.. 2018 ఎన్నికల సమయంలో సబితా ఇంద్రారెడ్డి నన్ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన మాట వాస్తవమే.. నేను మల్కాజ్ గిరి ఎంపీగా పోటీచేస్తే మద్దతిస్తానని సబిత చెప్పారు. గెలిపించే బాధ్యత తీసుకుంటానని అన్నారు. నన్ను మల్కాజ్ గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించాక సబిత మోసం చేశారు. కేసీఆర్ మాటలు నమ్మి బీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొందారు. నన్ను మోసం చేసింది నిజమో కాదో సబితా చెప్పాలి..నన్ను మోసం చేశారు కాబట్టే వాళ్లను నమ్మోద్దని కేటీఆర్ కు చెప్పానన్నారు సీఎం రేవంత్.