బీఆర్ఎస్​ భవన్​ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలన్న సీఎం

బీఆర్ఎస్​ భవన్​ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలన్న సీఎం
  • ఇంజనీర్లకు సీఎం కేసీఆర్​ ఆదేశం
  • ఢిల్లీలో భవన నిర్మాణ పనుల పరిశీలన
  • పలు మార్పులు చేర్పులు చేయాలని సూచన

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్​ రెండో రోజు బుధవారం వసంత్‌ విహార్‌లోని బీఆర్​ఎస్​ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజనీర్లతో పాటు వాస్తు నిపుణుడు సుద్దాల సుధాకర్​తేజను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూడు అంతస్తుల్లో కడ్తున్న ఈ భవన పనులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన.. పలు మార్పులు  చేర్పులు సూచించారు. టీఆర్​ఎస్​ను జాతీయ పార్టీ బీఆర్​ఎస్​గా మార్చినందున అందుకు తగ్గట్టుగా భవన నిర్మాణం ఉండాలని అన్నారు.

సమావేశ మందిరాలు, తన చాంబర్ సహా మిగతా ఆఫీసులు ఏ విధంగా ఉండాలో సూచించారు. త్వరగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. కేసీఆర్​ వెంట మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌ కుమార్, దామోదరరావు, వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. టీఆర్​ఎస్​ను బీఆర్​ఎస్​గా మారుస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత తొలిసారి ఢిల్లీ పర్యటనకు వచ్చిన కేసీఆర్​.. మరో మూడు, నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం.