
రోజురోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతండటంతో హైదరాబాద్ పరిధిలోని కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు మూసివేయాలని జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. పలు జిల్లాల నుంచి యువత నగరంలోని హాస్టళ్లలో ఉంటూ కోచింగ్కు, ఉద్యోగాలకు వెళ్తుంటారు. అలాంటి విద్యార్థులు, ఉద్యోగస్తుల కోసం నగరంలోని ఎస్.ఆర్. నగర్, అమీర్ పేట్, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో దాదాపు 500లకు పైగా హాస్టళ్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, యూపీ, ఒడిస్సా, ఢిల్లీ తదితర ప్రాంతాల వారు ఇక్కడి హాస్టళ్లలో ఉంటూ పలు కోర్సులు నేర్చుకుంటుంటారు. మరికొంత మంది ప్రైవేటు ఉద్యోగాలు చేస్తుంటారు. హాస్టల్ రూముల్లో బెడ్స్ ఆనుకుని ఉండటంతో పాటు.. చాలామంది ఎక్కడెక్కడో తిరిగి సాయంత్రానికి అంతా ఒకచోటికి చేరుతారు. దాంతో కరోన మరింత వ్యాప్తి చెందే ప్రమాదముంది. దాంతో కరోనా ప్రబలకుండా ఉండేందుకు అధికారుల ముందస్తు జాగ్రత్తలలో భాగంగా ఈ నెలాఖరు వరకు హాస్టళ్లను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశించింది. విద్యార్థులను హస్టళ్లు ఖాళీ చేసి స్వస్థలాలకు వెళ్లాలని సూచించింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్లాలంటే.. ఎక్కడికి వెళ్లాలని విద్యార్థలు వాపోతున్నారు. అలా వెళితే తమ చదువు పాడవుతుందని విద్యార్థులు అంటున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా.. తమ గురించి కూడా ఆలోచించి తమకు ప్రభుత్వం ఆశ్రయం కల్పించాలని వారు కోరుతున్నారు.
For More News..