
- ఆషాఢ మాసం ఉందని మూఢ నమ్మకాలతో ఆలస్యం చేయొద్దు
- ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కలెక్టర్ ఆదర్శ సురభి హెచ్చరిక
వనపర్తి, వెలుగు: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు గడువులోగా ఇంటి నిర్మాణం ప్రారంభించకుంటే మంజూరైన ఇళ్లు రద్దవుతాయని కలెక్టర్ఆదర్శ్సురభి తెలిపారు. గురువారం ఆయన పెద్దమందడి మండలం వెల్టూరులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బేస్మెంట్ పూర్తి కాగానే మొదటి విడత రూ.లక్ష ఖాతాలో జమ అవుతాయన్నారు. ఆషాఢ మాసమని, మూఢ నమ్మకాలతో కాలాయపన చేయవద్దన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని మూఢ నమ్మకాలతో కాలరాసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు వెంటనే ఇంటి నిర్మాణం ప్రారంభించాలన్నారు.
గ్రామ పంచాయతీ భవనంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులతో గ్రామ సభ ఏర్పాటు చేశారు. పదో తరగతిలో ఉత్తీర్ణత పొందిన ప్రతి అమ్మాయిని కాలేజీల్లో చేర్పించేందుకు పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ విద్యార్థులకు పంపిణీ చేశారు. కొత్తకోట మండలంలోని వడ్డే వాట గ్రామంలో కంసలి పార్వతమ్మ భర్త కంసాలి సాంతన్న ఇంటిని సందర్శించిన కలెక్టర్ ఇల్లు మంజూరు అయినప్పటికీ నిర్మాణం ఇంకా ఎందుకు ప్రారంభించలేదని అడిగారు.
ఇది ఆషాఢ మాసమని, రోజులు బాగాలేవని పార్వతమ్మ సమాధానం ఇచ్చింది. గ్రామంలో మొత్తం 23 ఇళ్లు మంజూరు కాగా మూఢ నమ్మకాలతో చాలా మంది నిర్మాణం ప్రారంభించ లేదు. గ్రామంలో మిగిలిన వారి ఇంటిని కూడా కలెక్టర్ స్వయంగా వెళ్లి త్వరగా ముగ్గులు పోసి నిర్మాణం ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దారు సరస్వతి, ఎంఈవో బి.విష్ణు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.