- కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డిటౌన్, వెలుగు : మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లోకల్, ఇంటర్నల్ కమిటీలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందన్నారు.
మహిళలపై లైంగిక వేధింపుల సమస్య వచ్చినప్పుడు ఆన్లైన్ బాక్స్ పోర్టర్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లా లీగల్ అథారిటీ కమిటీ సెక్రటరీ, జడ్జి టి.నాగరాణి, అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్, జిల్లాస్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు బదిలీ
కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో పలువురు తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజానరేందర్గౌడ్ బాన్సువాడ తహసీల్దార్గా, వి.వరప్రసాద్ను కామారెడ్డి కలెక్టరేట్కు, ఎ.మహేందర్కుమార్ను పిట్లం తహసీల్దార్గా, భిక్షపతి పెద్దకొడప్గల్, కె.సవల్ సింగ్ మహమ్మద్నగర్ తహసీల్దార్గా, సాయి భూజంగ్రావును నిజాంసాగర్ తహసీల్దార్గా, ఎం.వసంతను బాన్సువాడ ఆర్డీవో ఆఫీసుకు, రోజా కాముని నాయబ్ తహసీల్దార్ను బీబీపేటకు, సంతోషి నాయబ్ తహసీల్దార్ను భిక్కనూరుకు, యు.శృతి నాయబ్ తహసీల్దార్ను రాజంపేటకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అభ్యంతరాలపై గడువులోగా చర్యలు తీసుకోవాలి
మున్సిపాలిటీల పరిధిలోని వార్డుల వారీగా ముసాయిదా ఓటరు లిస్టుపై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులపై గడువులోగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు.
ముసాయిదా ఓటర్ల లిస్టుపై ఆయా పార్టీల నాయకులు అభ్యంతరాలు తెలిపారు. మార్పులు, చేర్పులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
