స్కూళ్ల రిపేర్లు పూర్తిచేయాలి : మను చౌదరి

స్కూళ్ల రిపేర్లు పూర్తిచేయాలి : మను చౌదరి

సిద్దిపేట రూరల్, వెలుగు: స్కూల్స్ రీ ఓపెనింగ్ కు ముందే యూనిఫామ్స్ సిద్ధం చేయాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన డీఈవో శ్రీనివాస్ రెడ్డితో కలిసి కొండపాక మండలంలోని బందారం జడ్పీహెచ్ఎస్ స్కూల్, ఎంపీపీఎస్, నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూళ్లను తనిఖీ చేశారు. 

అమ్మ ఆదర్శ స్కూల్​కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న స్కూల్​భవనాలు, విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీల మైనర్ రిపేర్ పనులను పరిశీలించారు. అనంతరం సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లిలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గవర్నమెంట్​స్కూల్​స్టూడెంట్స్​యూనిఫామ్ క్లాత్ కటింగ్ ను డీఆర్డీవో పీడీ జయదేవ్ తో కలిసి పరిశీలించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గవర్నమెంట్​స్కూళ్లలో రిపేర్లను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో విద్యాశాఖ సెక్టోరల్ అధికారి రామస్వామి, ఆయా మండలాల ఎంఈవోలు, ఇంజనీరింగ్ అధికారులు, ఆయా స్కూళ్ల హెచ్​ఎంలు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ పోలింగ్ ను పక్కాగా నిర్వహించాలి

నల్గొండ, -ఖమ్మం, -వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ మను చౌదరి ఎన్నికల అధికారులను ఆదేశించారు. జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, ధూల్మిట్ట, మద్దూరు మండలాల్లో ఈనెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు కలెక్టరేట్ లో శిక్షణ కార్యక్రం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కు బ్యాలెట్ బాక్స్ లను ఉపయోగిస్తున్నారని, పోలింగ్ ప్రారంభించే ముందు ఏజెంట్లకు ఖాళీ బ్యాలెట్ బాక్స్ లను చూయించి పోలింగ్ ప్రారంభించాలన్నారు. 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఓటర్లు బ్యాలెట్ పేపర్ ను చూసేందుకు సమయాన్ని ఇవ్వాలన్నారు. మైక్రో అబ్జర్వర్స్​ఓటింగ్ సరళిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి,  మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.