
సిద్దిపేట రూరల్, వెలుగు: భూభారతి చట్టంతో భూ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసమే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. జూన్ 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్దార్హరికిరణ్, డీటీ ఉదయశ్రీ, ఆర్ఐలు బాలయ్య, సంజీవ్ పాల్గొన్నారు.
స్కూళ్లలో పనుల కోసం ప్రతిపాదనలు పంపండి
ప్రభుత్వ బడుల్లో మైనర్ రిపేర్లు, అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో చేపట్టిన నిర్మాణ పనులను సమీక్షించారు.
కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా చేపట్టిన నిర్మాణ పనులు పూర్తయ్యి బిల్లులను కూడా చెల్లించామన్నారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్ రెడ్డి, సెక్టోరల్ అధికారి రామస్వామి, ఈడబ్ల్యూఐడీసీ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.