కరీంనగర్ టౌన్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆర్అండ్బీ, పోలీస్, రవాణా, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్టీసీ, ఇతర శాఖల అధికారులతో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు.
ప్రమాద అవకాశం ఉన్న స్థలాల్లో వాహనాల వేగ నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. జనవరి 1 నుంచి 31వరకు జిల్లాలో నిర్వహించే జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను సక్సెస్ చేయాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా స్కూల్ విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించాలని సూచించారు. సీపీ గౌస్ ఆలం జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లపై వివరించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
