- డబ్బులు ఉన్నా పనులు ఎందుకు చేయడం లేదు?
గద్వాల, వెలుగు: రూ.50 లక్షల ఫండ్స్ ఉన్నా ఆస్పత్రిలో అపరిశుభ్రత ఏంటని, విద్యుత్ పనులు ఎందుకు చేయడం లేదని జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆఫీసర్ల పై సీరియస్ అయ్యారు. గురువారం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసి అక్కడున్న అపరిశుభ్రతపై అసహనం వ్యక్తం చేశారు. ఐసీయూతోపాటు అన్ని వార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు.
చాలా రోజులుగా విధులకు హాజరుకాని డాక్టర్లను సరెండర్ చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో పరిసరాలను వెంటనే శుభ్రం చేయాలని, ఎక్కడ పడితే అక్కడ మంచాలు వేయడం సరికాదన్నారు. పనిచేయని మానిటర్ యంత్రాన్ని వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్, పంచాయతీరాజ్ ఈఈ ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
