టేక్మాల్, వెలుగు: ప్రభుత్వ దవాఖానలో అన్ని మందులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. ఆదివారం టేక్మాల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల గది, రోగుల రూములను, వైద్యుల హాజరు, ఓపీ, డ్యూటీ రిజిస్టర్లను పరిశీలించారు. ఆసుపత్రిలో ఏఏ మందులు అందుబాటులో ఉన్నాయని డ్యూటీ డాక్టర్ ఎవరని, రాత్రి వేళలో ఎంతమంది వైద్యులు, సిబ్బంది ఉంటున్నారని వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని, పరిశుభ్రమైన వాతావరణంలో వైద్యం అందించాలని, వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.
