రామాయంపేట మల్లె చెరువును సుందరీకరిస్తాం : కలెక్టర్ రాహుల్ రాజ్

 రామాయంపేట మల్లె చెరువును సుందరీకరిస్తాం : కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట, చేగుంట, వెలుగు: రామాయంపేట పట్టణంలోని మల్లె చెరువు సుందరీకరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం ఆయన తహసీల్దార్ ఆఫీసులో రికార్డులను పరిశీలించారు. వచ్చే నెల జరిగే రెవెన్యూ సదస్సులపై చర్చించారు. అక్కడి నుంచి మల్లె చెరువు వద్దకు చేరుకుని పరిశీలించారు. చెరువు సుందరీకరణకు చేపట్టాల్సిన పనులపై  అధికారులతో మాట్లాడారు.  గ్రీనరీ, ఫౌంటెన్, సీసీ రోడ్డు, ప్లాంటేషన్, సిట్టింగ్ ఏరియా, గార్డెన్, పార్కింగ్ స్థలాలను సమకూర్చాలని సూచించారు. ఆయన వెంట ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, తహసీల్దార్ రజని, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. 

ఎరువుల దుకాణాల తనిఖీ 

చేగుంట మండల కేంద్రంలోని శ్రీనివాస ఫర్టిలైజర్ షాపును కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల స్టాక్ రిజిస్టర్, నిల్వలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని తెలిపారు. నకిలీ విత్తనాల నియంత్రణలో భాగంగా వ్యవసాయ, పోలీస్ శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం ద్వారా సూచించిన నాణ్యమైన పత్తి విత్తనాలు  ఉపయోగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా యూరియా 8,115 టన్నులు, డీఏపీ 745 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 2,738 టన్నులు, పొటాష్ 450 టన్నులు, సూపర్ ఫాస్పేట్ 280 టన్నులు అన్నీ కలిపి 12,326 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు.  

 ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలి

మనోహరాబాద్: ధాన్యాన్ని  రైతుల నుంచి త్వరగా కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మండలంలోని దండుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ అకాల వర్షాలకు రైతులు అధైర్య పడవద్దని పండించిన ప్రతి గింజను కొంటామని చెప్పారు. ఇప్పటివరకు దండుపల్లి కేంద్రం వద్ద 214 మంది రైతుల నుంచి 963 టన్నుల  దాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట డీటీ కౌశిక, ఆర్ఐ దీక్షిత్ కుమార్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ స్రవంతి, నరేందర్ గౌడ్, సీనియర్ అసిస్టెంట్ సంపత్ పాల్గొన్నారు.

 బాల్య వివాహాలను అరికట్టాలి

మెదక్​ టౌన్: జిల్లాలో బాల్యవివాహాలు, అక్రమ దత్తతను అరికట్టాలని కలెక్టర్​ రాహుల్​రాజ్​సూచించారు. మెదక్​కలెక్టరేట్​లో ఐసీడీఎస్​శాఖ ఆధ్వర్యంలో బాలసదనంకు చెందిన13 ఏళ్ల బాలికను సీఏఆర్​ఏ మార్గదర్శకాల ప్రకారం పుదుచ్చేరికి చెందిన దంపతులకు దత్తత ఇచ్చారు. కలెక్టర్​ మాట్లాడుతూ.. ఎవరైనా పిల్లలను దత్తత తీసుకోవాలంటే జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో సంప్రదించాలని సూచించారు. అనంతరం బాలలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు రూపొందించిన పోస్టర్​ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్​నగేశ్, డీడబ్ల్యూవో హైమావతి, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.