తెలంగాణలో స్వేచ్ఛగా ఓటు వేయాలి : కలెక్టర్ శరత్

తెలంగాణలో స్వేచ్ఛగా ఓటు వేయాలి : కలెక్టర్ శరత్

సంగారెడ్డి టౌన్ ,వెలుగు: ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ పిలుపునిచ్చారు. మంగళవారం స్వీప్  కార్యక్రమాల్లో భాగంగా ఉద్యోగులు, అధికారులు, కళాకారులు, వివిధ వర్గాల ప్రజలతో కలిసి ఓటరు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన అర్హులందరినీ ఓటరుగా నమోదు చేశామన్నారు.

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే అవకాశం ఒక్క ఓటుకు మాత్రమే ఉందన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు వేయాలని సూచించారు. ఎస్పీ రూపేశ్​ మాట్లాడుతూ.. ఓటు వజ్రాయుధం లాంటిదని, బుల్లెట్ కన్నా బ్యాలెట్ ఎంతో గొప్పదన్నారు. విద్యార్థులు, యువత ఓటు వేయడంతో పాటు ఇంట్లో అందరూ ఓటు వేసేలా చైతన్య పర్చాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ చంద్రశేఖర్, అడిషనల్​ ఎస్పీ అశోక్,  అధికారులు డీఆర్‌‌ఓ నగేశ్,  వివిధ వర్గాల ప్రజలు, కళాకారులు పాల్గొన్నారు.

ALSO READ : తలకొండపల్లి మండలంలో రూ.19.38 లక్షల విలువ చేసే మద్యం స్వాధీనం : నర్సింహారెడ్డి

మెదక్ టౌన్: ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం పోలింలే లక్ష్యంగా స్వీప్​ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాజర్షి షా తెలిపారు. పట్టణంలో వాక్ ఫర్ ఓట్​అనే స్లోగన్​తో స్థానిక రాందాస్ చౌరస్తా నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజ్​ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ.. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. అనంతరం యువ ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్​, డీఈవో రాధాకిషన్​, డీఐఈవో సత్యనారాయణ, ఆర్​వో రాజేశ్వర్​, స్వీప్​ నోడల్​ అధికారి, డీడబ్ల్యువో బ్రహ్మాజీ, డీఎస్​వో రాజిరెడ్డి, డీవైఎస్​వో నాగరాజు, ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, కళాజాత బృందాలు పాల్గొన్నారు.