ఎలక్షన్​ రూల్స్​ పాటించాల్సిందే : కలెక్టర్ వల్లూరు క్రాంతి

ఎలక్షన్​ రూల్స్​ పాటించాల్సిందే : కలెక్టర్  వల్లూరు క్రాంతి

గద్వాల, వెలుగు : అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్స్​ రూల్స్​ పాటించాల్సిందేనని కలెక్టర్  వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. మంగళవారం ఐవోడీసీ కాన్ఫరెన్స్​ హాల్​లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రూల్​ ప్రకారం సువిధ పోర్టల్ లో ఆన్ లైన్ లో తప్పనిసరిగా పర్మిషన్​ తీసుకోవాలన్నారు.  నామినేషన్  తరువాత అభ్యర్థి తన ఎన్నికల ఖర్చును ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు.

ముందస్తు అనుమతి లేకుండా అభ్యర్థి తరపున ప్రచారం చేస్తే సెక్షన్ 171 హెచ్  కేసులు బుక్  చేస్తామని తెలిపారు. మద్యం, డబ్బు పంచితే ఆ అభ్యర్థి  డిస్ క్వాలిఫై కావడమే కాకుండా, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోతాడన్నారు. అడిషనల్​ కలెక్టర్లు అపూర్వ చౌహాన్, చీర్ల శ్రీనివాసరావు, ఆర్డీవో చంద్ర కళ పాల్గొన్నారు.

ప్రపోజల్స్​ పంపించాలి..

మహబూబ్ నగర్ కలెక్టరేట్ : ఈ నెల 18 లోగా డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్  సెంటర్ల ప్రపోజల్స్​ పంపించాలని మహబూబ్​నగర్​ కలెక్టర్  జి. రవి నాయక్ ఆదేశించారు. రిటర్నింగ్, నోడల్  ఆఫీసర్లతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. ఎన్నికల ట్రైనింగ్​ ప్రారంభించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్​ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీవో అనిల్ కుమార్, అడిషనల్​ కలెక్టర్  ఎస్. మోహన్ రావు, స్పెషల్  కలెక్టర్  నటరాజ్  పాల్గొన్నారు.

ఎన్నికల ఫిర్యాదులపై స్పందించాలి..

నాగర్ కర్నూల్ టౌన్ : జిల్లాలో ఎలక్షన్  రూల్స్​ పక్కాగా అమలు చేసి, ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌  పి ఉదయ్ కుమార్  అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌  మీటింగ్  హాల్​లో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినా, మీడియాలో ఫేక్ న్యూస్  ప్రసారమైనా, ఓటర్లకు ఎలాంటి అనుమానాలు వచ్చినా నివృత్తి చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. నోడల్  ఆఫీసర్లు​ఉష, నర్సింగ్ రావు, మాస్టర్ ట్రైనర్  చంద్రశేఖర్  పాల్గొన్నారు.

ప్రతి వెహికల్​ చెక్​ చేయాలి..

నారాయణపేట/ఊట్కూర్ : రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ లలో ప్రతి వెహికల్​ను పక్కాగా తనిఖీ చేయాలని కలెక్టర్​ కోయ శ్రీహర్ష సూచించారు. ఎస్పీ యోగేశ్ గౌతంతో కలిసి జలాల్ పూర్  చెక్ పోస్ట్ ను పరిశీలించారు. సెంట్రీ రిజిస్టర్ లో ప్రతి విషయాన్ని నమోదు చేయాలని ఆదేశించారు. బార్డర్  చెక్​పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. స్టేట్​ బార్డర్లలో ఏడు చెక్​పోస్టులు, జిల్లా బార్డర్​లో రెండు చెక్ పోస్ట్​లను ఏర్పాటు చేశామని తెలిపారు.

పట్టుబడిన డబ్బులు గ్రీవెన్స్  కమిటీ ముందు ఉంచి సరైన ఆధారాలు చూపిన తరువాతే తిరిగి  ఇవ్వాలని, ఆధారాలు చూపకుంటే సీజ్​చేయాలన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని శ్రీదత్త బీఈడీ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్​ ఏర్పాట్లను పరిశీలించారు. అడిషనల్​ కలెక్టర్లు మయాంక్  మిత్తల్, అశోక్  కుమార్, డీఎస్పీ సత్యనారాయణ పాల్గొన్నారు.