హన్వాడ, వెలుగు: హన్వాడలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ విజయేందిర బోయి తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వడ్ల తేమ శాతాన్ని పరిశీలించి, నిబంధనల మేరకు తేమ, తాలు, మట్టి లేని వడ్లను వెంటనే కొనుగోలు చేయాలన్నారు. వడ్ల కొనుగోలు వివరాలు, ట్యాబ్ ఎంట్రీపై ఆరా తీశారు.
కొనుగోలు చేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. రవాణా పరంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, పంట కొనుగోలు చేసిన తర్వాత పూర్తి బాధ్యత కేంద్రం నిర్వాహకులదేనని తెలిపారు. రైతులు మిల్లుకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లకు వెంటనే రిపేర్లు చేపించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీవో నవీన్ ఉన్నారు.
