ఖమ్మం జిల్లాకు చేరిన అడిషనల్ బ్యాలెట్ యూనిట్లు

ఖమ్మం జిల్లాకు చేరిన అడిషనల్ బ్యాలెట్ యూనిట్లు

ఖమ్మం టౌన్, వెలుగు :  ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అడిషనల్​ బ్యాలెట్ యూనిట్లు జిల్లాకు శుక్రవారం చేరుకున్నట్లు ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ జడ్పీ కాంప్లెక్స్ లోని ఈవీఎం గోడౌన్ వద్ద అడిషనల్​ బ్యాలెట్ యూనిట్లను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కంటెయినర్ నుంచి తీసి గోడౌన్ లో భద్రపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యరులను బట్టి అడిషనల్​ బ్యాలెట్ యూనిట్లు అవసరం కాగా, ఎన్నికల సంఘం  894 బ్యాలెట్ యూనిట్లను పంపించినట్లు తెలిపారు. 

స్లిప్పుల పంపిణీ

ఖమ్మం నగరంలోని సారథినగర్, ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్, తల్లంపాడు, కూసుమంచి మండల కేంద్రంలో ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీని కలెక్టర్​ గౌతమ్​ తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని  చెప్పారు. నగరంలోని నయాబజార్, ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్,  తల్లంపాడు, కూసుమంచి, పాలేరులోని స్కూళ్లలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీలు చేశారు. కూసుమంచి మండలం, నాయకన్ గూడెం లో ఏర్పాటు చేసిన ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్, స్టాటిటిక్ సర్వేలైన్స్​ టీమ్ చెక్‌పోస్టును పరిశీలించి పలు సూచనలు చేశారు. 

‘మన ఊరు మన బడి’ పనులపై సమీక్ష 

పోలింగ్ కేంద్రాలు ఉన్న స్కూళ్లలో మన ఊరు, మన బడి కింద చేపట్టిన పనుల పురోగతిపై వివిధ ఇంజినీరింగ్ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమం కింద చేపట్టిన వాటిలో ప్రస్తుతం 251 స్కూళ్లలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో 99 స్కూళ్లలో పనులు పూర్తి కాగా, 34 స్కూళ్లలో 90 శాతానికి పైగా, 81 స్కూళ్లలో 50 నుంచి 80 శాతం, 37 స్కూళ్లలో50 శాతానికి లోపు పనులు పూర్తయినట్లు ఆయన తెలిపారు. ఈ స్కూళ్లలో పెండింగ్​ పనులన్నీ ఈ నెల 25లోపు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. 
సీ విజిల్ యాప్​పై అవగాహన ఉండాలి

కూసుమంచి :  సీ విజిల్​యాప్​పై ప్రతి ఓటరుకు అవగాహన ఉండాలని ఖమ్మం కలెక్టర్​ వీపీ గౌతమ్​చెప్పారు. శుక్రవారం కూసుమంచిలో స్కూల్​ లోని పోలింగ్​బూత్​లను ఆయన పరిశీలించారు. సీ విజీల్​ యాప్​గురించి ఓటర్లుకు వివరించారు. అనంతరం నాయకన్​గూడెం వద్ద పోలీసు చెక్​పోస్టును తనిఖీ చేశారు. ఆయన వెంట ఎస్సై రమేశ్​కుమార్, ఆర్​వో రాజేశ్వరి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.