స్టూడెంట్‌ను వేధించిన ..శ్రీచైతన్య కాలేజీ చైర్మన్‌ అరెస్టు

స్టూడెంట్‌ను వేధించిన ..శ్రీచైతన్య కాలేజీ చైర్మన్‌ అరెస్టు
  • కాలేజీ ఫీజు మాఫీ చేస్తానని విద్యార్థినులపై లైంగిక వేధింపులు
  • ఎవరికైనా చెబితే ఫెయిల్  చేస్తానని బెదిరింపులు
  • అతనికి సహకరించిన మెస్  ఇన్ చార్జి కూడా అరెస్టు

హసన్ పర్తి, వెలుగు : విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీచైతన్య కాలేజీ చైర్మన్  బూర సురేందర్  గౌడ్ ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అతనికి సహకరించిన మెస్  ఇన్ చార్జి శ్రావణ్ ను కూడా అరెస్టు చేశారు. ఫీజులు మాఫీ చేస్తానని, డబ్బులు ఇస్తానని బెదిరించి, ప్రలోభపెట్టి అమ్మాయిలపై చైర్మన్  వేధింపులకు పాల్ప డ్డాడు. అతని ఆగడాలు భరించలేక బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని బాగోతం అంతా బయటపడింది.

హన్మకొండ ఏసీపీ కిరణ్  కుమార్  తెలిపిన వివరాల ప్రకారం హన్మకొండ జిల్లా  బీమారం గ్రామంలోని శ్రీచైతన్య కళాశాల చైర్మన్  బూర సురేందర్  గౌడ్  తన కాలేజీలో చదువుతున్న విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మెస్  ఇన్ చార్జి దొం తి  శ్రవణ్ సహాయంతో బాలికలను తన రూమ్ కు రప్పించుకొని వారితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం ఎవరికైనా చెప్తే పరీక్షల్లో ఫెయిల్  చేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సుమారు 11.30 గంటల ప్రాంతంలో సెకండియర్  చదువుతున్న ఓ అమ్మాయికి మెస్  ఇన్ చార్జి శ్రవణ్ తో ఫోన్  చేయించి ఆ అమ్మాయిని తన వద్దకు పంపాలని చెప్పాడు. ఆమె, తన స్నేహితులను తీసుకొని చైర్మన్  వద్దకు వెళ్లింది.

తన మాట వినడం లేదంటూ ఆ అమ్మాయిని సురేందర్  గౌడ్  ఇష్టంవచ్చినట్లు తిట్టి అంతు చూస్తానని బెదిరించాడు. బాధితురాలితో పాటు వెళ్లిన  మరో అమ్మాయి అడ్డుపడగా ఆమెను కూడా కొట్టాడు. అనంతరం సురేందర్  గౌడ్,  శ్రవణ్  అక్కడి నుంచి పారిపోయారు. ఆదివారం విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సురేందర్ గౌడ్, దొంతి శ్రవణ్ ను అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. నిందితులపై ఎస్సీఎస్టీ చట్టంతో పాటు పోక్సో కింద కేసు నమోదు చేశారు.