
హైదరాబాద్, వెలుగు: దుండిగల్లో నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను తొందరలోనే ప్రారంభిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనిండ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఈపీటీఆర్ఐ) డైరెక్టర్ జనరల్ వాణి ప్రసాద్తో కలిసి శుక్రవారం దుండిగల్ ప్లాంట్ను ఆయన పరిశీలించారు. 14.5 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్లోని పలు యూనిట్లను సందర్శించారు. ర్యాంప్, ఆర్డీఎఫ్ టైపింగ్ హాల్ పిట్ టర్బైన్ జనరేటర్, మాస్టర్ కంట్రోల్ రూం బాయిలర్, చిమ్నీ, స్విచ్ యార్డ్ యూనిట్లను పరిశీలించారు.
వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్కు అన్ని అనుమతులు వచ్చిన నేపథ్యంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేయాలని అధికారులకు రోనాల్డ్ రోస్ సూచించారు. ప్లాంట్కు సంబంధించిన స్టిచ్చింగ్ స్టేషన్, కంట్రోల్ రూమ్ పనులు పూర్తయిన నేపథ్యంలో ప్లాంట్ను ఛార్జ్ చేసేందుకు ట్రాన్స్ మిషన్ లైన్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఏజెన్సీని ఆదేశించారు. కమిషనర్ వెంట ఎస్ డబ్ల్యూఎంఎస్ సీ కోటేశ్వరరావు, అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఈఈ శ్రీనివాస్ రెడ్డి, రీల్(రాంకీ) డైరెక్టర్ వీఎస్ వెంకటేశన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శాస్త్రి, తోట కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.