మల్కాజిగిరి, వెలుగు: చీలిపోయిన కమ్యూనిస్టులు ఏకం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీఎస్.బోస్ పిలుపునిచ్చారు. పార్టీ ఆధ్వర్యంలో బాసర నుంచి ప్రారంభమైన బస్సు జాతా గురువారం ఈసీఐఎల్ కు చేరుకుంది. దమ్మాయిగూడా నుంచి ఈసీఐఎల్ లోని అంబేద్కర్ కూడలి వరకు ఆ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అనేక రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎదుర్కోలేకపోయిందన్నారు. అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులు పురోగమిస్తున్నారని అన్నారు.
దేశ ప్రజలు కమ్యూనిస్టు పార్టీల వైపు చూస్తున్నారని, మతం పేరుతో అరాచకాలను ఎదుర్కొనే శక్తి తమకే ఉందని అన్నారు. బూటకపు ఎన్కౌంటర్లు మానుకోవాలని కేంద్రానికి హితవు పలికారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ, వలి ఉల్లా ఖాద్రి, ఉప్పలయ్య, నరేంద్ర ప్రసాద్, మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేశ్, రాష్ట్ర సమితి సభ్యులు జి.దామోదర్ రెడ్డి, సాయిలు గౌడ్ పాల్గొన్నారు.
