బాధిత కుటుంబాలకు 50 లక్షల చొప్పున పరిహారమివ్వాలి

బాధిత కుటుంబాలకు 50 లక్షల చొప్పున పరిహారమివ్వాలి

పాలమూరు రంగారెడ్డి ఫ్యాకేజీ 1 లో జరిగిన ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనుల్లో భాగంగా పంప్ హౌస్ లోకి దిగుతుండగా ప్రమాదం జరిగి ఐదుగురు కార్మికులు మరణించారు. ఈ నేపథ్యంలో ఒక్కో బాధిత కుటుంబానికి రూ.50 లక్షల రూపాయల నష్ట పరిహారం అందజేయాలని జూపల్లి డిమాండ్ చేశారు. వీరి కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు పోరాడుదామని పిలుపునిచ్చారు. 

రెడిమిక్స్ లిఫ్ట్ చేస్తుండగా ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబం సభ్యులు చెప్పారన్న జూపల్లి కృష్ణారావు..కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. అంతే కాకుండా కాంట్రాక్టర్ సహా సంబంధిత వారిపై  పోలీసులు  హత్య కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్న జూపల్లి..భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈ ప్రమాదంలో చనిపోయిన ఐదుగురిలో నలుగురు జార్ఖండ్ కి చెందిన వారు కాగా..  నిడదవోలుకి చెందిన మరో వ్యక్తి కూడా ఉన్నారు. 

నాగర్‌ కర్నూలు జిల్లాలోని పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం పనుల్లో విషాదం నెలకొంది. కొల్లాపూర్ మండలం రేగమనగడ్డ దగ్గర జరుగుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనుల్లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు కూలీలు మరణించారు. క్రేన్ సాయంతో పంప్ హౌస్ లోకి దిగుతుండగా వైర్ తెగిపోవడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహలను రాత్రే హైదరాబాద్ ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్య బృందం అభిజిత్ నేతృత్వంలో ఐదుగురు కార్మికుల మృతదేహాలకు పోస్ట్ మార్టం కొనసాగుతోంది. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు జార్ఖండ్ కు చెందిన భోలేనాథ్ (45),  ప్రవీణ్ (38), కమలేష్ (36 ), బీహార్ కు చెందిన సోను కుమార్ (36), ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీను (40)గా గుర్తించారు. ఈ ఘటన పాలమూరు, రంగారెడ్డి ప్యాకేజీ -1లో జరిగింది.

ముందేహెచ్చరించినా పట్టించుకోలేదా..? 

మరోవైపు జూన్ 10వ తేదీన పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నేషనల్ లేబర్ కమిషన్ చైర్మన్ పపరిశీలించారు. నిర్మాణ పనుల్లో రక్షణ చర్యలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా లోపాలపై ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు. అయినా.. కాంట్రాక్టు ఏజెన్సీ, అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇవాళ ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.