మేడిగడ్డలో అడుగడుగునా..అవినీతి..నిర్లక్ష్యం!

మేడిగడ్డలో అడుగడుగునా..అవినీతి..నిర్లక్ష్యం!
  • ఎన్​డీఎస్​ఏ కమిటీ నిర్ధారణ    
  •     ప్రాజెక్ట్​ పూర్తి కాకుండానే కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారు
  •     అప్పటి ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పి కీలక ఫైళ్లను ఆఫీసర్లు మూవ్​ చేశారని గుర్తింపు
  •     జలసౌధలో ఇరిగేషన్​ అధికారులతో కమిటీ భేటీ

హైదరాబాద్​, వెలుగు : మానవ తప్పిదాలు, అవినీతి, నిర్లక్ష్యం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని నేషనల్​ డ్యామ్​సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్ఏ) నిపుణుల కమిటీ గుర్తించినట్టు తెలిసింది. మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం బ్యారేజీకి బుంగలు పడటం సహా ప్రతి స్టేజ్​లోనూ అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్టుగా తేల్చినట్టు సమాచారం. ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని కీలకమైన ఫైళ్లను అప్పటి అధికార పార్టీలోని పెద్దల పేర్లు చెప్పి మూవ్​ చేసినట్టు ఎన్​డీఎస్​ఏ నిపుణుల కమిటీ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ప్రాజెక్టు పూర్తికాకుండానే.. పూర్తయినట్టుగా అప్పటి ప్రభుత్వ పెద్దల నుంచి నిర్మాణ సంస్థ సర్టిఫికెట్​ను పొందినట్టు కమిటీకి తెలిసిందని సమాచారం. 

కాగా, మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై విచారణ చేస్తున్న ఎన్​డీఎస్​ఏ నిపుణుల కమిటీ.. 1850లో నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజీ డిజైన్లనూ పరిశీలించినట్టు తెలిసింది. చెన్నై ఆర్కైవ్స్​లో ఉన్న ధవళేశ్వరం బ్యారేజీ డిజైన్లను తెప్పించుకుని పరిశీలించిందని తెలుస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీలో అడుగడుగునా డిజైన్​ లోపాలున్నాయని కమిటీ గుర్తించినట్టు సమాచారం. బుధవారం జలసౌధలో చంద్రశేఖర్​ అయ్యర్​ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎన్​డీఎస్​ఏ నిపుణుల కమిటీ.. ఇరిగేషన్​ అధికారులతో సమావేశమైంది. ఈఎన్​సీ జనరల్స్​, హైడ్రాలజీ, సెంట్రల్​ డిజైన్స్​ ఆఫీస్​ (సీడీవో) అధికారులను ఒక్కొక్కరిని పిలిచి వివరాలను సేకరించింది. సాయంత్రం 3.30 గంటలకు మొదలైన సమావేశం.. దాదాపు ఐదు గంటల పాటు సాగింది. ఈ నెల 7, 8, 9, 10వ తేదీల్లో తొలిసారి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించిన నిపుణుల కమిటీ.. అధికారులతో సమావేశమై ఒక్కొక్కరి నుంచి విడివిడిగా వివరాలను సేకరించిన సంగతి తెలిసిందే. 

మీటింగ్​కు మాజీ ఈఎన్సీలు హాజరు

ఈ నెల 10న జరిగిన మీటింగ్​కు రాని మాజీ ఈఎన్సీలు మురళీధర్​ రావు, వెంకటేశ్వర్​ రావులు.. తాజా సమావేశానికి హాజరయ్యారు. సాయంత్రం ఆరున్నరకు మీటింగ్​కు వచ్చిన వారిని దాదాపు గంట పాటు నిపుణుల కమిటీ విచారించినట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి వివరాలనూ మురళీధర్​ను ఎన్​డీఎస్​ఏ నిపుణుల కమిటీ అడిగినట్టు తెలిసింది. ప్రాజెక్ట్​ డిజైన్లు, కాంట్రాక్టు సంస్థల పనితీరు, బ్యారేజీ నిర్మాణ శైలి సహా వివిధ అంశాలపై ఆరా తీసినట్టు తెలిసింది. ప్రాజెక్టు కట్టిన తర్వాత మూడేండ్ల దాకా దానిని ఎందుకు మానిటర్​ చేయలేదని ప్రశ్నించినట్టు సమాచారం. ప్రాజెక్ట్​ ఆపరేషన్స్​ అండ్​ మానిటరింగ్​లో జరిగిన నిర్లక్ష్యంపై సమాచారాన్ని సేకరించిందని తెలుస్తున్నది. సమావేశాలకు అందుబాటులో ఉండాల్సిందిగా ఆయన్ను ఆదేశించినట్టు సమాచారం. మరోవైపు హైడ్రాలజీ, సీడీవో అధికారుల నుంచి పాత సమాచారాన్నే అడిగినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే బ్యారేజీ నిర్మాణ స్థలంలోని పరిస్థితులు, వరద తీరు, డిజైన్లు సహా ఫైళ్లు, రిపోర్టులను నిపుణుల కమిటీకి అందజేశామని అధికారులు చెప్తున్నారు. మరోవైపు అధికారుల నుంచి డీపీఆర్​ ప్రిపరేషన్లు, డిజైన్లు, ప్రాజెక్ట్​ ప్లానింగ్​ తదితర వివరాలను అధికారుల నుంచి నిపుణుల కమిటీ అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. 

ఓ అండ్​ ఎం అధికారులతో ఇవాళ మీటింగ్​

ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఆపరేషన్స్​ అండ్​ మానిటరింగ్​ (ఓ అండ్​ ఎం) విభాగం ఆఫీసర్లతో ఎన్​డీఎస్​ఏ నిపుణుల కమిటీ గురువారం సమావేశం కానున్నది. సీడీవో అధికారులతో బుధవారం మీటింగ్​ అసంపూర్తిగా ముగియడంతో గురువారం మళ్లీ వారి నుంచి వివరాలను తీసుకోనున్నది. ప్రాజెక్ట్​ కన్​స్ట్రక్షన్​ అథారిటీతోనూ సమావేశం కానున్నది. మధ్యాహ్నం మూడు బ్యారేజీల నిర్మాణ సంస్థలు, ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీలు, క్వాలిటీ కంట్రోల్​ అండ్​ ఇన్వెస్టిగేషన్​ అధికారులతో సమావేశమై వివరాలను తీసుకోనున్నది.