లాటరీలో పేర్లు వచ్చినా.. ఇండ్లు ఇవ్వలేదు

లాటరీలో పేర్లు వచ్చినా.. ఇండ్లు ఇవ్వలేదు
  • బల్దియా హెడ్డాఫీసు వద్ద లబ్ధిదారుల ఆందోళన

హైదరాబాద్, వెలుగు: లబ్ధిదారుల ఎంపిక లాటరీలో తమ పేర్లు వచ్చినా..  డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదని  గోషామహల్​కి చెందిన పలువురు   సోమవారం బల్దియా హెడ్డాఫీసు ముందు ఆందోళన  చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలతో 145 మందిమి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. మూడో లిస్ట్ లో తమ పేర్లు వచ్చాయని, అయినా ఇండ్లను  కేటాయించలేదన్నారు. సిటీలోనే ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. ఎక్కడకు వెళ్లిన తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు.

తమకు న్యాయం చేయాలని హైదరాబాద్ కలెక్టర్ వద్దకు వెళ్లామని, మంత్రి పొన్నం ప్రభాకర్ ని కూడా కలిశామన్నారు.  కమిషనర్ ని కలవమని మంత్రి చెప్పారని, ఆయనకు వినతిపత్రం ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులకు తాము నష్టపోయామని, కొత్త ప్రభుత్వం చొరవతీసుకొని తమకు ఇండ్లను అందించాలని కోరారు.