- దళిత బంధు లబ్ధిదారుల ఎంపికపై లొల్లి
- వేర్వేరు జాబితాల్లో ఏది ఫైనల్ చేయాలో తేల్చుకోలేకపోతున్న అధికారులు
- ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న చోట మరీ కిరికిరి
- గడువు దాటినా ఫైనల్ కాని లబ్ధిదారుల ఎంపిక
హైదరాబాద్, వెలుగు : దళిత బంధు స్కీమ్ లబ్ధిదారుల ఎంపికపై ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య కిరికిరి మొదలైంది. ఎమ్మెల్యేలు ఒక లిస్ట్ ఇస్తే.. ఇన్చార్జి మంత్రులు ఇంకో లిస్ట్ తీసుకొస్తున్నారు. దీంతో ఏది ఫైనల్ చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఫిబ్రవరి ఐదో తేదీలోపే ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని సర్కారు చెప్పినా.. ఇంకా అనేక జిల్లాల్లో లిస్ట్ ఫైనల్ కాలేదు.
ఒక్కొక్కరు ఒక్కో లిస్ట్..
దళిత బంధు కోసం రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గం నుంచి వంద మందిని ఎంపిక చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకు ఎటువంటి గైడ్లైన్స్ను రిలీజ్ చేయలేదు. ఇన్చార్జి మంత్రి అనుమతితో ఎమ్మెల్యేలే లబ్ధిదారుల లిస్ట్ ఫైనల్ చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఎమ్మెల్యేలు వంద మంది లిస్ట్ను అధికారులకు అందజేసినా, మంత్రులు మరో 50 మంది లిస్ట్ ఇస్తున్నారు. అధికారులు ఏంచేయాలో అంతుచిక్కక రెండు లిస్టుల్లో వెరిఫికేషన్ చేస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట పరిస్థితి మరోలా ఉంది. నాంపల్లి నియోజకవర్గంలో ఎంఐఎం ఎమ్మెల్యే లబ్ధిదారుల లిస్ట్ ఇచ్చినా, హైదరాబాద్కు చెందిన ఓ మంత్రి 50 మందితో కూడిన మరో జాబితాను అధికారులకు పంపారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నియోజకవర్గం గోషామహల్లోనూ ఇదే పరిస్థితి. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గంలోనూ లిస్టుల పంచాయతీ నడుస్తోంది. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నేతలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు వేర్వేరుగా లిస్టులు రూపొందిస్తున్నారు.
లిస్ట్ ఫైనల్ చేసే గడువు దాటి నెల కావొస్తున్నా..
దళిత బంధు స్కీమ్ స్పీడ్గా అమలు చేయాలని, త్వరగా గ్రౌండింగ్ చేయాలని సర్కారు సూచనలు చేసింది. ఫిబ్రవరి 5వ తేదీలోగా లబ్ధిదారుల లిస్ట్ ఫైనల్ చేయాలని ఆదేశించింది. కానీ మరో రెండు రోజుల్లో డెడ్లైన్ దాటి నెల రోజులు అవుతుంది. కానీ ఇంకా సగం జిల్లాల్లో లిస్ట్ ఫైనల్ కాలేదు. ఇంకా లిస్టే ఫైనల్ చేయకుంటే ట్రైనింగ్, అవగాహన సదస్సులు, నిధులు విడుదల, యూనిట్ల గ్రౌండింగ్ ఎప్పుడు చేస్తారని ఎస్సీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బడ్జెట్ రిలీజ్ అయితే అకౌంట్లు ఫ్రీజ్ అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.