సింగరేణి మెడికల్​ బోర్డులో మాయాజాలం

 సింగరేణి  మెడికల్​ బోర్డులో మాయాజాలం

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణి  మెడికల్​ బోర్డులో మాయాజాలం నెలకొంది. మెడికల్​ బోర్డుకు అటెండ్​ అయ్యేవారి వివరాలను సీక్రెట్​​​గా  ఉంచాల్సి ఉన్నప్పటికీ  లీక్​ కావడం కలకలం సృష్టించింది. మెడికల్​ బోర్డులో దళారుల దందా సాగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. కొత్తగూడెంలోని సింగరేణి హాస్పిటల్​లో గురు, శుక్రవారాల్లో కారుణ్య నియామకాల్లో భాగంగా మేనేజ్​మెంట్​ మెడికల్​ బోర్డు నిర్వహించింది.

మెడికల్​ బోర్డుకు అప్లై చేసుకున్న వారిలో అర్హులైన వారికి ఒకటి రెండు రోజుల ముందు మెయిన్​ హాస్పిటల్​ నుంచి వారు పనిచేస్తున్న  మైన్​/డిపార్ట్ మెంట్​కు సమాచారం వెళ్తుంది.  మైన్​/డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లు మెడికల్​ బోర్డుకు అటెండ్​ కావాలని సమాచారం ఇస్తారు. ఈ విషయం అప్లై చేసుకున్న వారికే  తెలియాలి.  ఇదిలా ఉండగా సింగరేణి వ్యాప్తంగా మెడికల్​ బోర్డుకు అటెండ్​ అయ్యే వారి వివరాలు మెడికల్​ బోర్డు ఇంటర్వ్యూలకు గంట ముందుగానే సోషల్​ మీడియాలో హల్ చల్​ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మెడికల్​ బోర్డు ఇంటర్వ్యూలు దాదాపు రెండు గంటల పాటు ఆలస్యంగా  ప్రారంభమయ్యాయి.

 సింగరేణి వ్యాప్తంగా 178 మంది అటెండ్​ కావాల్సి ఉండగా దాదాపు 36 మంది ఆబ్సెంట్​ కావడం గమనార్హం. మెడికల్​ బోర్డుకు అటెండ్​ అయ్యే వారి వివరాలు బయటకు రావడంతో హాస్పిటల్​ అధికారులు అలర్ట్​ అయ్యారు. ఈ సారి మెడికల్​ బోర్డు స్ట్రిక్ట్​గా ఉంటుందనే ప్రచారం సాగడంతో దళారులు ముందస్తుగా తమతో ఒప్పందం చేసుకున్న వారిని అటెండ్​ కాకుండా చూసుకున్నారని ప్రచారం జరిగింది. ఆబ్సెంట్ అయిన వారు ఎందుకు రాలేదో అనే విషయంతో పాటు సోషల్​ మీడియాలో ముందస్తుగానే బోర్డుకు అటెండ్​ అయ్యే వారి వివరాలు ఎలా బయటకు వచ్చాయో యనే అంశంపై  విజిలెన్స్​ ఆఫీసర్లు విచారణ చేస్తున్నారు.