హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో దసరా సెలవుల పొడగింపుపై స్టూడెంట్స్, తల్లిదండ్రులతోపాటు విద్యాసంస్థల యాజమాన్యాల్లోనూ అయోమయం నెలకొంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ నెల19వ తేదీ వరకు స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్ బోర్డు, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారికంగా సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు మాత్రం ప్రస్తుతానికి ఈ నెల15 వరకే సెలవులు పొడగించామని, మరింత పొడగించే విషయం15వ తేదీన మళ్లీ ప్రకటిస్తామని తల్లిదండ్రులకు మెస్సేజ్లు పంపాయి.
దీంతో వారు అయోమయానికి గురవుతున్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల స్కూళ్లకు సెలవుల పొడగింపు లేదని మొదట చెప్పినా 19వ తేదీ వరకు సెలవులు ఉంటాయని మళ్లీ ప్రకటించారు. గురుకుల కాలేజీలు సోమవారం నుంచి నడుస్తాయని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను పరిష్కరించలేక స్కూళ్లు, కాలేజీలకు సెలవులు పొడగించడం సరికాదని ఎస్ఎఫ్ఐ తెలంగాణ అధ్యక్షులు మూర్తి, కార్యదర్శి టి.నాగరాజు పేర్కొన్నారు.