మంత్రి మల్లారెడ్డి పాదయాత్రను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు

మంత్రి మల్లారెడ్డి పాదయాత్రను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర నిర్వహిస్తున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి కాంగ్రెస్ శ్రేణుల నుండి నిరసన సెగ ఎదురైంది. గబ్బిలాల పేట ప్రాంతంలో పాదయాత్ర నిర్వహిస్తుండగా కాంగ్రెస్ నాయకులు మంత్రి మల్లారెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. జవహర్ నగర్ ప్రాంతంలో సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పటివరకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జవహర్ నగర్ లో 58, 59 జీవో అమలు, 50 పడకల ఆసుపత్రి విషయంలో మంత్రి మల్లారెడ్డి హామీలకే పరిమితమయ్యారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. 

దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను టీఆర్ఎస్ నాయకులు అక్కడ నుండి తోసేశారు. ఈ తోపులాటతో గబ్బిలాల్ పేట ప్రాంతంలో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే మంత్రి మల్లారెడ్డి జవహర్ నగర్ ప్రాంతంలో నెలకొన్న సమస్యల విషయంలో పరిష్కారం చూపాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమని కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించారు.